నియోజ‌క‌వ‌ర్గాల వేట‌లో చిన్న‌మ్మ‌.. ఈ సారి అసెంబ్లీకే!

బీజేపీ రాష్ట్ర సార‌థిగా ఇటీవ‌ల ప‌గ్గాలు చేప‌ట్టిన అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఒక‌వైపు పార్టీ ప‌నిలో నిమ‌గ్న మైన‌ట్టే మ‌రోవైపు.. త‌న నియోజ‌క‌వ‌ర్గం వేట‌లోనూ త‌ల‌మున‌క‌లై ఉన్నార‌నే చర్చ సాగుతోంది. అదికూడా ఈ సారి ఆమె అసెంబ్లీ నియ‌జ‌క‌వ‌ర్గంపైనే దృష్టి పెట్టార‌ని పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె అసలు అసెంబ్లీ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌ర్వాత బీజేపీలోకి వ‌చ్చినా.. పార్ల‌మెంటు వైపే చూశారు. విశాఖ‌ప‌ట్నం నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో బీజేపీలో చేరారు.

అప్పుడు కూడా.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి, 2019లో విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పురందేశ్వ‌రి పోటీ చేశారు. అయితే, రెండు సార్లు కూడా ఓట‌మి చ‌విచూశారు. ఇక‌, ఈ సారి మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న‌ట్టు బీజేపీలో నేతల మ‌ధ్య చ‌ర్చ‌సాగు తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉంటుండ‌డం.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం అయితే..ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఖ‌ర్చు చేయాల్సి ఉన్న ద‌రిమిలా.. ఈ ద‌ఫా ఆమె అసెంబ్లీకి ప‌రిమితం కావాల‌ని భావిస్తున్నార‌ని ఓ వ‌ర్గం నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌పై పురందేశ్వ‌రి దృష్టి పెడుతున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట‌, లేదా.. ప‌రుచూరు(సొంత నియోజ‌క‌వ‌ర్గం) నుంచి పురందేశ్వ‌రి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని.. కుద‌రితే రెండు నియోజక‌వ‌ర్గాల నుంచి కూడా పోటీ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ సారి గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా పురందేశ్వ‌రి పావులు క‌దుపుతున్న‌ట్టు చెబుతున్నారు. రాజంపేట విష‌యానికి వ‌స్తే.. 2014లో పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఇప్పుడు కేవ‌లం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయితే.. గెలుపు ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

అలా కాదంటే.. ఈ సారి త‌న కుటుంబం నుంచి ఎవ‌రూ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా లేనందున సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌రుచూరు నుంచి పురందేశ్వ‌రి పోటీకి సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ఏలూరు సాంబ‌శివ‌రావు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా.. మ‌హిళా సెంటిమెంటును రాజేయ‌డం ద్వారా.. విజ‌యం సునాయాశంగా ద‌క్కుతుంద‌ని చిన్న‌మ్మ లెక్క‌లు వేసుకుంటున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా.. ఈ సారి గెలుపు గుర్రం ఎక్కాల‌నే ద్రుఢ సంక‌ల్పంతో ఉన్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.