బోస్ వ‌ర్సెస్ వేణు… తోట‌కు చాన్స్‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల మ‌ధ్య రాజుకున్న అసంతృప్తి, అస‌హ‌న మంట‌లు ఎక్క‌డా ఆర‌డం లేదు. సాక్షాత్తూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని.. ఇది త‌గ‌దు.. ఎన్నిక‌లకు ముందు మీరు ఇలా చేస్తారా? అని ప్ర‌శ్నించినా.. ఇది చేయొద్ద‌ని హెచ్చ‌రించినా నాయ‌కులు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌ల నిరూప‌ణ‌లో ముందున్నారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిజిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌కవ ర్గం కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయం ర‌గులుతూనూ ఉంది.

ఈ నెల 2(ఆదివారం)న మాజీ మంత్రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌.. ఇక్క‌డ మంత్రి చెల్లు బోయిన వేణుకు వ్య‌తిరేకంగా ఉన్న‌వారిని కూడ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారితో ప్ర‌త్యేకంగా స‌భ నిర్వ‌హించి బ‌ల‌నిరూప‌ణ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని ఇక్క‌డ నుంచి నిల‌బెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పేశారు. ఇది పెద్ద వివాదంగా మారి.. పార్టీ ఆయ‌న‌ను పిలిచి చ‌ర్చించే వ‌ర‌కు వ‌చ్చింది. అయినా ఇక్క‌డి ప‌రిస్థితి స‌ర్దుబాటు కాలేదు.

తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణు కూడా బ‌ల నిరూప‌ణ‌కు రెడీ అయ్యారు. ఈరోజు(ఆదివారం) ఆయ‌న త‌న మ‌ద్ద‌తు దారుల‌తో రామ‌చంద్ర‌పురంలో భేటీ అయ్యారు. దీనికి ఆయ‌న బ‌ల నిరూప‌ణ అని పైకి చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఎంపీ పిల్లికి చెక్ పెట్టే వ్యూహంతోనే ఆయ‌న ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున త‌న మ‌ద్ద‌తు దారుల‌ను విందు స‌మావేశానికి ఆహ్వానించారు. తాను జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టి మూడేళ్ల‌యింద‌ని.. అందుకే ఈ స‌మావేశం పెడుతున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

కానీ, అంత‌ర్గ‌తంగా చూస్తే.. మాత్రం పిల్లి వ‌ర్గానికి ఆయ‌న ఈ వేదిక ద్వారా.. భారీ స‌వాళ్లే విసర‌నున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, అటు పిల్లి కానీ, ఇటు చెల్లుబోయిన కానీ.. ఇద్ద‌రూ కూడా శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో రామచంద్ర‌పురం రాజ‌కీయం హీటెక్కింద‌నే వాద‌న మరింతబ‌లంగా వినిపిస్తోంది. మ‌రోవైపు కాపు నాయ‌కులు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ ఇద్ద‌రూ కొట్టుకుని.. ప‌క్క‌కు జ‌రిగితే.. టికెట్‌ను త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు తోట త్రిమూర్తులు.. చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.