ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్ల. దాదాపు 75 ఏళ్ళకు దగ్గరలో ఉన్న సోనియా ఈమధ్య ప్రత్యక్షరాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వయసు అడ్డంకి కాకపోయినా అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్ కు బ్రిటన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. వయోభారం, అనారోగ్యం తదితర కారణాల వల్ల చివరకు అధ్యక్ష పదవికి కూడా దూరంగా ఉంటున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించారట.

ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని సోనియా ఈమధ్యే రాహుల్, ప్రియాంకతో పాటు పార్టీలోని అత్యున్నత స్ధాయి నేతలకు చెప్పారట. అంటే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటారు కానీ రాజకీయాలకు మాత్రం కాదు. ఈ నేపధ్యంలోనే వచ్చేఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్ళే అవకాశాలున్నాయి. ఈ విషయమై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రతిపాదన చేశారట. మొన్న 17, 18 తేదీల్లో బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండు రోజుల సమావేశమైన విషయం తెలిసిందే.

ఆ సమావేశానికి సోనియా కూడా బెంగుళూరుకు వచ్చారు. అప్పుడు సిద్ధరామయ్య రాజ్యసభ ప్రతిపాదన పెట్టారట. దానిపై సోనియా ఎలాంటి నిర్ణయం చెప్పలేదు కానీ తిరస్కరించను కూడా లేదు. ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 137 సీట్లతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సుమారు ఐదారు రాజ్యసభ స్ధానాలు దక్కుతాయి. కాబట్టి ఒకటి సోనియాకు కేటాయించాలన్నది సిద్ధూ ఆలోచన.

ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులకు వచ్చేఏడాది ఏప్రిల్లో టర్మ్ అయిపోతుంది. వీరిలో ఒకరు బీజేపీ సభ్యుడు కూడా ఉన్నారు. సునాయాసంగా పెద్దలసభకు సోనియా వెళ్ళచ్చు కాబట్టే సిద్ధూ కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలికి ప్రాతినిద్యం వహిస్తున్న సోనియా స్ధానంలో వచ్చేఎన్నికల్లో ప్రియాంక పోటీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. అమేథిలో పోటీచేసి ఓడిపోయిన రాహుల్ విషయమే అయోమయంగా తయారైంది. కోర్టు తీర్పువల్ల ఆరు ఏళ్ళపాటు ఎన్నికలకు రాహూల్ దూరమైనట్లే. ఒకవేళ సుప్రింకోర్టో ఊరట దక్కితే సరే లేకపోతే కుటుంబం మొత్తంమీద ప్రియాంక మాత్రమే పోటీలో ఉంటారు.