ఎంఎల్ఏ ఆస్తులు వేలమా ?

వ్యాపారాలు, పరిశ్రమల పేరుతో బ్యాంకుల్లో అప్పులు తీసుకోవటం, తర్వాత వాటిని ఎగ్గొట్టడం ఇపుడు ఎక్కువైపోతున్నాయి. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళల్లో ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలే ఉంటున్నారు. తమ పలుకుబడితో తీసుకున్న అప్పులను చెల్లించకుండా రానిబాకీల ఖాతాలో వేయించేసుకుని బయటపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడింతా ఎందుకంటే వైసీపీ పుట్టపర్తి ఎంఎల్ఏ దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆస్తులు వేలానికి రావటమే కారణం. కెనరా బ్యాంకులో ఎంఎల్ఏ వ్యాపారాల కోసం వందల కోట్ల లోన్లు తీసుకున్నారు. ఇపుడు రు. 900 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో బ్యాంకు స్పష్టంచేసింది.

అయితే తీసుకున్న అప్పు కాదుకదా చివరకు నెలవారీ కట్టాల్సిన మొత్తాలను కూడా కట్టడంలేదు. దాంతో బ్యాంకు ఎంఎల్ఏకు నోటీసులిచ్చింది. అయినా ఉపయోగం లేకపోవటంతో చివరకు వేలం నోటీసు జారీచేసింది. ఆస్తులను ఆగష్టు 18వ తేదీన వేలం వేయబోతున్నట్లు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చింది. ఎంఎల్ఏ కుటుంబానికి రియల్ ఎస్టేట్, సోలార్ పవర్ ప్రాజెక్టులతో పాటు చాలా వ్యాపారాలున్నాయి.

ఎక్కడ తప్పుజరిగిందో కానీ తీసుకున్న అప్పులను ఎంఎల్ఏ కుటుంబం తీర్చలేకపోయింది. అప్పు తీసుకోవటానికి హైదరాబాద్ తో పాటు అనంతపురం, కర్నూలులోని తన భూములు, ఇతర ఆస్తులను ష్యూరిటీగా పెట్టారని సమాచారం. మామలూగా అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చలేకపోవటం అంటూ ఉండదు. ఏదో పద్దతిలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు మించే లాభాలను సంపాదించుకుంటారు. బ్యాంకులో అప్పులు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలు సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్, రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాసరావు తదితరులపై ఉన్నాయి. గతంలో ఇదే విషయమై గంటా ఆస్తులను ఎటాచ్ చేయటానికి బ్యాంకు బహిరంగ ప్రకటనే జారీచేసింది. అయితే ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధంలేదని గంటా ప్రకటించారు.

మామూలుగా అయితే బ్యాంకుల్లో కుదవపెట్టిన ఆస్తులు వేలం నోటీసు దాకా పరిస్ధితి తెచ్చుకోరు. మరిపుడు ఎంఎల్ఏ ఆర్ధిక పరిస్ధితి ఎలాగుందో తెలీదు. ఇదే విషయమై బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతు తీసుకున్న అప్పులో కొంత, నెలవారీ కట్టాల్సిన కంతులు కట్టేస్తే వేలంపాట ఆగిపోతుందన్నారు. మరి ఎంఎల్ఏల ఈ సమస్య నుండి ఎలాగ బయటపడతారో చూడాలి.