జ‌గ‌న్‌ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు.. చాలా త‌ప్పు!!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు ఆర్‌. కృష్ణ‌య్య యోగ్య‌తా ప‌త్రం(స‌ర్టిఫికెట్) ఇచ్చారు. ఇది కొంత ఆశ్చ‌ర్యంగానే ఉన్నా.. నిజ‌మే. జ‌గ‌న్ నిఖార్స‌యిన మాన‌వతా మూర్తి అని కృష్ణ‌య్య ఆకాశానికి ఎత్తేశారు. “అస‌లు జ‌గ‌న్ ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు. ఇలా చాలా త‌ప్పు. ఆయ‌నలో సంఘ సంస్క‌ర్త ఉన్నాడు. ఆయ‌న‌లో బీసీల పెన్నిధి ఉన్నాడు. ఈ విష‌యాన్ని ఎందుకు వ‌దిలేస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్‌ను అన్ని కోణాల నుంచి చూడండి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది”- అని ఆర్ కృష్ణ‌య్య వ్యాఖ్యానించారు.

తాజాగా విశాఖ‌ప‌ట్నంలో జిల్లాకు చెందిన బీసీ సామాజిక‌వ‌ర్గం ఆధ్వ‌ర్యంలో ‘విశాఖ బీసీ గ‌ర్జ‌న‌’ పేరిట స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో ఆర్‌. కృష్ణ‌య్య పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కుడు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌. కృష్ణ‌య్య మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ ను భువ‌న భువ‌నాంత‌రాళ‌కు ఎత్తేశారు. ఒక్క సారిగా పూన‌కం వ‌చ్చిన వ్య‌క్తిగా వ్యాఖ్య‌లు సంధించారు. సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌తిప‌క్షాల నుంచి సొంత పార్టీ నాయ‌కుల వ‌ర‌కు కూడా కేవ‌లం రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నార‌ని అన్నారు.

కానీ, జ‌గ‌న్‌లో సంఘ సంస్క‌ర్త దాగి ఉన్నార‌ని, ఒక‌ప్పుడు గుర‌జాడ అప్పారావు, టంగుటూరి ప్ర‌కాశం పంతులు వంటివారు సంస్క‌ర్త‌లుగా పేరు తెచ్చుకున్నార‌ని.. కానీ, వాళ్ల‌ను ఈ త‌రం ప్ర‌జ‌లుచూసి ఉండ‌ర‌ని.. అచ్చంగా జ‌గ‌న్ అలాంటి సంస్క‌ర్తేన‌ని కృష్ణ‌య్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పేదింటి విద్యార్తీ చదువుకొనే విధంగా, స్కూల్‌కు వెళ్లేలా జ‌గ‌న్ నిరంత‌రం ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన వంటి ప‌థ‌కాల‌ను ఎవ‌రూ అమ‌లు చేయ‌ని విధంగా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర చరిత్ర.. ప్ర‌జ‌ల నాలుక‌ల‌పై ఉన్నన్ని రోజులూ జగన్ పేరు నిలిచిపోతుందని కృష్ణ‌య్య చెప్పారు. ఏపీలో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఇతర రాష్ట్రాలు కంటే.. ఏపీలోనే బీసీ సామాజిక వ‌ర్గం ఎంతో సంతోషంగా గ‌డుపుతోంద‌ని, ప్ర‌భుత్వానికి , బీసీల‌కు మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింద‌ని పేర్కొన్నారు. ద‌క్కాల్సిన వాటా కంటే ఎక్కువగానే ఏపీలో బీసీలకు దక్కుతోందని, ఈ ఘ‌న‌త జ‌గ‌న్‌దేన‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి సీఎంజ గ‌న్‌కు కృష్ణ‌య్య యోగ్య‌తా ప‌త్రం ఇచ్చారు. అయితే.. దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. “రాజ్య‌స‌భ సీటు రుణం ఇలా తీర్చుకుంటున్నారా?” అని వ్యాఖ్యానిస్తున్నారు.