వైసీపీకి భారీ దెబ్బ‌.. 7-8 శాతం ఓట్లు గండి.. రీజ‌నేంటి..?

jagan

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా.. ముంద‌స్తు కోయిల‌లు కూస్తున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్న ద‌రిమిలా.. రాష్ట్రంలో ఒక‌విధ‌మైన ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తుంది? అనే ఇంట్ర‌స్టింగ్ టాపిక్ జ‌నాల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌రోవైపు స‌ర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వ‌స్తాయ‌నే లెక్క‌లు చెబుతున్నారు.

స‌రే.. ఎవ‌రు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫ‌లితాన్ని బ‌ట్టి చూస్తే వైసీపీ స‌ర్కారుకు భారీ దెబ్బ త‌గిలే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిప‌డు తోంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది.

అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని స‌ర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల‌.. వ్య‌తిరేక స‌ర్వేరాయుళ్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ముక్త‌కంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ కేవ‌లం 42-43 శాతం ఓటు బ్యాంకుకే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. తిరిగి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న సీఎం జ‌గ‌న్ ఆశ‌లు ఏమేర‌కు సానుకూలంగా మార‌తాయి? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మే. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయ‌కులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు త‌గ్గుతుంద‌న్నఅంచ‌నాల నేప‌థ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్ల‌లో పార్టీ ఓట‌మి చెందే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని అడ్డుకునేందుకు.. క‌ట్ట‌డి చేసేందుకు జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.