కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారా ?

కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన అంటే శనివారం నరేంద్రమోడీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కేసీయార్ పాల్గొంటారా గైర్హాజరవుతారా అన్నదే తెలీటంలేదు. ఇదే విషయమై పార్టీతో పాటు ప్రభుత్వవర్గాలను ఎంతడిగినా ఎవరు నోరు విప్పటంలేదు. కొంతకాలంగా మోడీ రాష్ట్రానికి వచ్చిన ఏ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ గైర్హాజరయ్యారని అందరికీ తెలిసిపోతోంది.

మోడీ విధానాలపైన కేసీయార్ ఒకపుడు ఫుల్లుగా విరుచుకుపడేవారు. అయినదానికి కానిదానికీ మోడీని కేసీయార్ పదేపదే టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బీజేపీని గద్దెదింపేస్తానని, బంగాళాఖాతంలో పడేయాలని, మోడీ ఆటలు ఇక సాగనిచ్చేదిలేదని చాలా మాటలే మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో ఒక ఫ్రంటు ఏర్పాటుచేయటానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే ఏదికూడా సాధ్యంకాలేదు. దాంతో ఆ ప్రయత్నాలను మానుకుని తానే ఒక జాతీయపార్టీ పెట్టేశారు.

అయితే ఇదంతా చరిత్రగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది. స్కామ్ బయటపడినపుడు దాని తీవ్రత అంతగా లేదు కాని దర్యాప్తులో చాలా డొంకలు కదిలేటప్పటికి దాని తీవ్రత దేశంలోనే సంచలనమైపోయింది. స్కామ్ లో చేతులుమారిన మొత్తం పెద్దదేమీ కాకపోయినా అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యుటి సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులతో పాటు కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.

ఎప్పుడైతే కవిత పేరు తెరమీదకు వచ్చిందో ఈడీ విచారణ కూడా జరిగింది. అరెస్టు ఖాయమని తేలిపోయింది. అయితే తెరవెనుక ఏమిజరిగిందో కానీ కవిత అరెస్టు జరగలేదు. బీజేపీతో కేసీయార్ లోపాయికారీ ఒప్పందం కారణంగానే కవిత అరెస్టు జరగలేదనే ప్రచారం పెరిగిపోయింది. మోడీకి వ్యతిరేకంగా కేసీయార్ కూడా నోరిప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే మోడీ వరంగల్ లో పర్యటించబోతున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని కేసీయార్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం కూడా అందిందట. మరి కేసీయార్ ఏమిచేస్తారు ? అన్నదే సస్పెన్సుగా మారింది.