కేసీఆర్ బిహేవియర్ ఎలా ఉంటుందో బయటపెట్టిన పొంగులేటి

ponguleti srinivas reddy
ponguleti srinivas reddy

వైసీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరి… తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. ఆయన గులాబీ కారును ఎందుకు దిగేశారు? అన్న డౌట్ కు చాలాసార్లు సమాధానం చెప్పారు. అయితే.. తాజాగా మాత్రం సీన్ టు సీన్ తనకు జరిగిన అవమానాల్ని ఏకరువు పెట్టారు. తాజాగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన పొంగులేటి.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీరు ఎలా ఉంటుంది?
పార్టీ నేతలకు ఎంతటి నరకాన్ని చూపిస్తారు?
కేసీఆర్ మాటలకు చేతలకు మధ్య తేడా ఎంత?
పార్టీ నేతల్ని కలిసే విషయంలో ఆయన ప్రదర్శించే అహంభావం గురించి షాకింగ్ వివరాల్ని వెల్లడించారు.

బీఆర్ఎస్ లో బానిసలా ఉండటం ఇష్టం లేకనే తాను బయటకు వచ్చినట్లు చెప్పిన పొంగులేటి.. వెయ్యి పశువులను తిన్న రాంబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లుగా రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి కూడా ఇలాగే మారుతుందని చెప్పటం గమనార్హం. బీఆర్ఎస్ లోకి చేరాలని 2014 ఎన్నికల కౌంటింగ్ దశలోనే తనను కేటీఆర్.. హరీశ్ రావు.. ఈటల వరుస పెట్టి అడిగారని.. తన చుట్టూ తిరిగారన్నారు. ముందు.. నో చెప్పినా.. రెండేళ్ల మూడు నెలల తర్వాత పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు.

అప్పట్లో తానున్న వైసీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో జగన్ ను అడిగితే.. వద్దన్నారని.. కష్టాలు ఉంటాయి కానీ వాటిని అధిగమిస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పినా తాను బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు మొదట్నించి వ్యాపారాలు ఉన్నాయని.. వాటి ప్రయోజనాల కోసమే అయితే.. తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వాడిని కాదన్న పొంగులేటి.. “నాతో పార్టీలోకి వచ్చే ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకోవటానికి సమయం ఇవ్వాలన్న షరతు మీద పార్టీలో చేరా. బీఆర్ఎస్ లో చేరిన నాలుగేళ్ల పాటు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి నేనే కాదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఇతర నేతలు అనుభవిస్తున్నదే. కానీ.. వారెవరూ ఆ విషయాన్ని బయటకు చెప్పటం లేదు” అని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఛాన్స్ ఇప్పించాలని మంత్రి కేటీఆర్ ను అడిగితే.. ఢిల్లీకి రమ్మన్నారు. దీంతో.. ఇరవై మందితో కలిసి వెళ్లా. అక్కడికి వెళ్లాక.. ఆయన్ను కలిసి ఏకాంతంగా మాట్లాడాలని అడిగిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ.. “ఉంటావు కదా.. రేపొద్దున కలుద్దామన్నారు. సంతోష్ రేపు ఉదయం పిలిపించమన్నారు. పొద్దున్నే రెడీ అయి సంతోష్ కు ఫోన్ చేసి ఏ టైంకు రావాలని అడిగా. పెద్దనాన్న ని అడిగి చెబుతానని చెప్పాడు. అంతే.. అప్పటి నుంచి టైం చెప్పరు. వెయిట్ చేస్తూ.. నాలుగు రోజులు నరకం చూపించారు. నాతో తీసుకెళ్లిన పది మంది ముందు ఎంతో అవమానంగా అనిపించింది. అప్పటి నుంచే కసి పెరిగింది. పార్టీ నుంచి బయటకు రావాలని.. కేసీఆర్ ను గద్దె దించాలన్నదే నా అంతిమ ఆశయంగా నిర్ణయించుకున్నా” అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.

కాంగ్రెస్ లో చేరటానికి ముందు.. భవిష్యత్తులో బీఆర్ఎస్ తో కలిసి నడిచే అవకాశం లేదన్న విషయం మీద క్లారిటీ తీసుకున్న తర్వాతే తాను పార్టీలో జాయిన్ అయినట్లు పొంగులేటి వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పిన తర్వాతే.. కాంగ్రెస్ లో చేరే నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని చెప్పారు. షర్మిల తనకు సోదరి అని.. పార్టీలో చేరమని అడిగిన విషయాన్ని చెప్పారు. అప్పట్లో అధికార పార్టీలో ఉండటంతో రాలేదని.. జీవితాంతం కాంగ్రెస్ లో ఉండాలన్న ఆలోచనలోనే పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పార్టీ బలహీన పడినట్లు చెప్పారు. బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటేనన్న అనుమానం రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ వచ్చేసిందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోయినట్లుగా వెల్లడించారు.