అప్పుడే పొంగులేటి మొదలుపెట్టేశారా ?

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ ను ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని కొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొడతానని బహిరంగంగా చాలెంజ్ కూడా చేశారు. అందుకనే తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లున్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో భేటీ అయ్యారు.

నిజానికి కోమటిరెడ్డి టెక్నికల్ గా బీజేపీ నేతే అయినా మనసంతా కాంగ్రెస్ లో ఉంది. ఎందుకంటే కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ సడెన్ గా పుంజుకున్నది. ఇతరపార్టీల నుండి కాంగ్రెస్ లో చేరేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కొన్నినెలలుగా బీజేపీ స్తబ్దుగా ఉండిపోయింది. ఎంతప్రయత్నిస్తున్నా బీజేపీలో ఎవరు చేరటంలేదు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కుదిరినట్లులేదు. అందుకనే చేరికల కమిటి ఛైర్మన్ ఈటల రాజేందర్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోతోంది.

విచిత్రం ఏమిటంటే ఈటలే తొందరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈటలతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి లాంటి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దాంతో కోమటిరెడ్డి కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమని ఊపందుకుంది. దీనికితోడు రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతు తన తమ్ముడు కాంగ్రెస్ లోకి వచ్చేస్తారన్నట్లుగా సంకేతాలిచ్చారు. ఆ సంకేతాలతో బీజేపీలో అయోమయం మొదలైపోయింది.

పొంగులేటి కాంగ్రెస్ లో చేరగానే కోమటిరెడ్డితో భేటీ కావటం కలకలం మొదలైంది. తాను కాంగ్రెస్ లో చేరితే మునుగోడు లేదా ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారట కోమటిరెడ్డి. అధిష్టానం దీనికి అంగీకరిస్తే కోమటిరెడ్డి వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ అధ్యక్షస్ధానం నుండి బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించారు. దీంతో కోమటిరెడ్డి పునరాలోచిస్తారా ? లేకపోతే తన ప్రయత్నాలతో తాను ముందుకెళిపోతారా ? అన్నదే తెలీటంలేదు. ఏదేమైనా కోమటిరెడ్డితో భేటీ ద్వారా పొంగులేటి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లే ఉన్నారు.