సీఎం రమేశ్‌కు కేంద్ర మంత్రి పదవి?

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు గేర్‌అప్ కావడానికి అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రాలలో ప్రత్యక్ష ప్రభావం పడే నిర్ణయాలే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ పార్టీలో చాలా మార్పులు చేపడుతోంది. అయితే.. ఎన్నికలు జరగని రాష్ట్రాలలో మార్పులకు కారణం అక్కడి రాజకీయ పరిస్థితులే. కాంగ్రెస్ పార్టీ కూడా గేరు మారుస్తుండడంతో ముందు జాగ్రత్తగా తనకు పట్టులేని రాష్ట్రాలలో కూడా ప్రాధన్యమున్న నిర్ణయాలు తీసుకుంటోంది బీజేపీ అధిష్ఠానం. అందులో భాగంగానే త్వరలో ఉంటుందంటున్న మోదీ కేబినెట్ విస్తరణలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణతో ఏపీ నుంచి కూడా ఒకరికి చాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేయడంతో ఆయన స్థానంలో పాత అధ్యక్షుడు బండి సంజయ్‌కు కానీ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌కు కానీ మోదీ కేబినెట్లో చోటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గిరిజన కోటాలో సోయం బాపూరావు కూడా ఆశలు పెట్టుకున్నప్పటికీ అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే, తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఏపీ నుంచి సీఎం రమేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తారన్న మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మొన్నటి కర్ణాటక ఎన్నికల సమయంలో బయటకు కనిపించనప్పటికీ సీఎం రమేశ్ పార్టీకి ఆర్థికంగా తన వంతు సాయం చేశారన్న ప్రచారం ఒకటి ఉంది. అంతేకాదు.. ఇటీవల అమిత్ షా, జేపీ నడ్డాలు విశాఖపట్నం వచ్చినప్పుడు మొత్తం వ్యవహారమంతా సీఎం రమేశే చూసుకున్నారని చెప్తున్నారు. ఆ రోజు ప్రధాన పత్రికలలో అమిత్ షా, నడ్డాలకు ఆహ్వానం పలుకుతూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు రమేశ్. కోట్లు ఖర్చుబెట్టి వారి సభకు ప్రచారం కల్పించారు.

టీడీపీ నుంచి బీజేపీలోకి అప్పట్లో జంప్ చేసిన ముగ్గురిలో పార్టీ పెద్దల వద్ద పట్టు సాధించుకున్నది కూడా సీఎం రమేశే. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లో బీజేపీలో అంతగా మింగిల్ కాలేకపోయారు. సీఎం రమేశ్ మాత్రం సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, విధానాలు షేర్ చేస్తుండడమే కాకుండా అగ్రనేతలు షేర్ చేసేవి కూడా తన అకౌంట్లతో షేర్ చేస్తూ అవన్నీ అధిష్ఠానం దగ్గర బాగా ప్రోజెక్ట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో జేపీ నడ్డా ఆశీస్సులు సీఎం రమేశ్‌కు ఉన్నాయని, అమిత్ షా దగ్గర కూడా మంచి పేరే ఉందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో ఆయనకు ఈసారి బెర్తు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్తున్నారు.