బీజేపీనే మార్చేసిన ఏపీ

“When in Rome, do as the Romans do” ఇది ఇంగ్లిషులో పాపులర్ అయిన ఓ జాతీయం. తెలుగులో అయితే ఏ ఎండకా గొడుగుపట్టడం అనొచ్చు. ఏదైనా ఒక కొత్త దేశానికో లేదా ప్రాంతానికో వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతేనే మనకు మనుగడ ఉంటుంది. లేదంటే అక్కడ ఉన్నంత కాలం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ ‘జాతీయం’ మన దేశ రాజకీయాలకు అతికినట్లు సరిపోతుంది.

ఆయా ప్రాంతాలను బట్టి రాజకీయ నేతలు మారిపోకుంటే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ…ఏపీలో ట్రెండ్ ఫాలో అవ్వడానికి రెడీ అయింది. అందుకు తగ్గట్లుగానే చకచకా పావులు కదుపుతోంది. దేశమంతా వర్కవుటయిన మతవాద రాజకీయాలు ఏపీలో వర్కవుట్ కాదని బీజేపీ లేటుగా అయినా గ్రహించింది.

అందుకే, ఏపీలో పాపులర్ అయిన కుల రాజకీయాలకు కనెక్ట్ అయింది. ఇకపై, ఏపీలో సామాజిక వర్గాల ఆధారంగా అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే, ఏపీలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గపు ఓటు బ్యాంకును గుంపగుత్తగా కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఏపీలోని రెండు ప్రధాన సామాజిక వర్గాల కంటే అధికంగా ఉన్న కాపులతో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని బీజేపీ భావిస్తోంది. కాపులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే నాయకత్వంతో ఏపీని కాషాయీకరించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును ఏపీ బీజీపీ అధ్యక్షుడిగా నియమించింది.

ఏపీలో కుల రాజకీయాల హవా సాగుతోందనేది బహిరంగ రహస్యమే. వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం…..టీడీపీకి కమ్మ సామాజిక వర్గం నుంచి ఆర్థిక, సామాజిక బలం లభిస్తుందన్నది జగమెరిగిన సత్యం. అందుకే, ఇప్పటిదాకా ఏపీలో సంప్రదాయ రాజకీయాలు చేసిన బీజేపీ…రూటు మార్చింది.

ఏపీలో మతం కార్డు పక్కన పెట్టి కులం కార్డును మెడలో వేసుకుంటోంది కాషాయ పార్టీ. అధికార, ప్రతిపక్ష పార్టీలకు దన్నుగా నిలుస్తున్న ఆ రెండు సామాజిక వర్గాల కంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు నాలుగు రెట్లు ఎక్కువ. అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు పూర్తి స్థాయిలో అధికారం చేపట్టలేకపోయారు.

2009లో ‘ప్రజారాజ్యం’ తో చిరంజీవి ఆ ఓటుబ్యాంకును చూసే అధికారం దక్కించుకోవాలని భావించారు. కానీ, కేవలం 18 సీట్లకే పరిమితమై ఆ తర్వాత…ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇక, 2014లో జనసేనతో పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నించారు. అయితే, 2014లో సొంతగా బరిలోకి దిగని జనసేన….టీడీపీకి మద్దతిచ్చింది.

దీంతో, టీడీపీ వ్యతిరేక ఓట్లన్నీ వైసీపీకి వెళ్లాయి. ఇక, 2019 ఎన్నికల్లో సొంతగా పోటీ చేసినా….టీడీపీకి జనసేనకు లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రచారంతో జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ….కాపులందరినీ ఏకం చేసి…2024లో అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా వైసీపీ, టీడీపీల వెన్నంటి ఉన్న సామాజిక వర్గాలకు దీటుగా పోటీనివ్వగల సత్తా కాపు సామాజిక వర్గానికి ఉందని బీజేపీ భావిస్తోంది.

కాపు సామాజికవర్గాన్ని పునాదిగా చేసుకొని….తటస్థులు, ఇతర వర్గాల ఓటు బ్యాంకును కలుపుకొని 2024 ఎన్నికలలో సత్తా చాటాలని చూస్తోంది. బీజేపీ, జనసేనల కలయికకు వీర్రాజు, పవన్ ల నాయకత్వం అండగా ఉందన్న సంకేతాలను పంపి కాపు ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. అందుకే, ఏపీలో బీజేపీ స్టాండ్ ఇదేనంటూ కాపులకు బాహాటంగానే సందేశం పంపింది బీజేపీ అధిష్టానం.

ఏపీలో 15 శాతం వరకూ ఓటింగ్ ఉన్న బలమైన సామాజిక వర్గమైన కాపుల మద్దతు బీజేపీ, జనసేనకు దక్కేందుకు ప్రయత్నాలు చేపట్టింది బీజేపీ. అందుకే, దేశమంతా మతపరమైన సెంటిమెంట్ తో రాజకీయం చేస్తోన్న బీజేపీ….ఏపీలో మాత్రం సామాజిక వర్గ సమీకరణాలను నమ్ముకుంది. ఏ ఎండకా గొడుగని….ఏపీ విషయానికొచ్చేసరికి బీజేపీ విధానం మారింది. ఏది ఏమైనా….జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని నమ్ముకున్న బీజేపీ….ఏపీలో వేరే విధానం అవలంబించడం విశేషం. ఎంతైనా బీజేపీని మార్చిన ఘనత ఆంధ్రోళ్లకు దక్కుతుందనడంలో సందేహం లేదు.