కేసీయార్ గాలమేస్తున్నారా ?

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని బాలయోగి స్టేడియంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ ముగింపు ఉత్సవాలు జరుపుతున్నారు. నిజానికి ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యత క్షత్రియ సేవాసమితి పేరుమీదే జరుగుతోంది. కానీ దీనికి బ్యాక్ గ్రౌండ్ లో ఉండి మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నదంతా మంత్రి కేటీయార్ అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేటీయార్ అంటే కేసీయార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు ఎవరికీ.

ఇతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో క్షత్రియ సామాజికవర్గం సంఖ్య తక్కువే. అయితే ఉన్నవాళ్ళంతా ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు. ప్రధానంగా నిజాంపేట, కోకాపేట, నల్లకుంట, హైదర్ నగర్, కొంపల్లి, కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారు. సీమాంధ్ర ప్రజలు ఉన్న పాకెట్లలోనే క్షత్రియులు కూడా ఉన్నారని చెప్పచ్చు. మొదటినుండి కూడా వీళ్ళతో కేటీయార్ కు మంచి సంబంధాలే ఉన్నాయి.

అందుకనే వీళ్ళకి మంత్రి కూడా బాగా ప్రాధాన్యతిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే కాకుండా తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మెజారిటి క్షత్రియులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. రాబోయే ఎన్నికల్లో వ్యక్తిగతంగా కేసీయార్ కు పార్టీపరంగా బీఆర్ఎస్ కు చాలా కీలకమైనది. అందుకనే క్షత్రియుల ఓట్లు జారిపోకుండా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ లో భాగమే సీతారామరాజు ముగింపు ఉత్సవాలు.

నిజానికి సీతారామరాజుకు తెలంగాణాతో ఎలాంటి సంబంధంలేదు. సీతారామరాజు కార్యస్ధానమంతా వైజాగ్ ప్రాంతంలోని చింతపల్లి అడవులే. కాకపోతే పుట్టింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లా. ఏ రకంగాచూసినా సంబంధంలేని హైదరాబాద్ లో సీతారామరాజు ముగింపు ఉత్సవాలు జరపాల్సిన అవసరమే లేదు. అయినా చేస్తున్నారంటే కేవలం క్షత్రియుల ఓట్లకోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ లో మంచి ఊపుకనిపిస్తోంది. జనాల్లో కూడా కేసీయార్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. అందుకనే ఈ సామాజికవర్గం జారిపోకుండా చూసుకుంటున్నట్లున్నారు.