ఏపీలో మ‌ద్య నిషేధం సాధ్యం కాదు : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో మ‌ద్య నిషేధం సాధ్యం కాద‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. మ‌ద్యాన్ని నిషేధించ‌క‌పోయినా.. మ‌ద్యం ధ‌ర‌ల‌ను మాత్రం త‌గ్గిస్తామ‌న్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ధ‌ర‌ల‌ను రాష్ట్రంలో అమ‌లు చేసే బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్పారు. వారాహి యాత్ర‌లో భాగంగా గ‌త ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగాశుక్ర‌వారం రాత్రి నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడారు.

మద్య నిషేధం పేరుతో 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్రభుత్వం ప‌క్కాగా మోసం చేసింద‌ని ప‌వ‌న్ విమ‌ర్శంచారు. మద్యం ధరలు బాగా పెంచి, త‌న వారికే డిస్టిల‌రీలు అప్ప‌గించిన ఘ‌న‌త తెలుగు స‌రిగా రాని జ‌గ‌న్‌కే చెల్లుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని మండిపడ్డారు.

మా పోరాటం బ‌ల‌వంతుల‌ పై..

జ‌నసేన పోరాటం.. 151 మంది ఎమ్మెల్యేలు, 40 మందికిపైగా ఎంపీలున్న బ‌ల‌వంతుల‌తోనేన‌ని జ‌న‌సేనాని చెప్పారు. దశాబ్దకాలంగా ప్రజాసమస్యలపై జనసేన పోరాటం చేస్తోంద‌న్నారు. జ‌న‌సేన‌కు గెలుపు, ఓటమి ఉండదన్న ప‌వ‌న్‌ ప్రయాణమే ఉంటుందన్నారు. అన్ని కులాల మధ్య జ‌గ‌న్ స‌ర్కారు చిచ్చు పెడుతోందన్నారు. కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. 190 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్న వైసీపీలో కేవలం ఒక్క కులమే అధికారం చ‌లాయిస్తోంద‌ని, దీనికే తాను వ్య‌తిరేక‌మ‌ని చెప్పారు. అలాగ‌ని ఆ కులానికి కూడా తాను వ్య‌తిరేకం కాద‌ని తెలిపారు.

”భీమవరంలో ఓటమి నాకు తెలియలేదు. భీమవరంలో నేను ఓడిపోయినట్లు అనిపించడం లేదు. పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా. వైసీపీ నడుపుతున్న దోపిడీ వ్యవస్థపై పోరాడుతున్నాం. యువత కోసం వైసీపీ ఏం చేసింది?. సరైన రాజకీయ వ్యవస్థ లేకుంటే ఎంత ప్రతిభ ఉన్నా నిరుపయోగమే. పథకాల పేరు పెట్టుకోవడం కాదు. యువతకు ఏం చేశారు?.“ అని సీఎం జ‌గ‌న్‌ను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ నిల‌దీశారు. క్లాస్‌ వార్‌ గుర్చించి మాట్లాడే నైతిక అర్హత సీఎంకు లేదన్నారు.

అప్పుడు ఊగ‌డం స‌హ‌జ‌మే!

వ‌రాహిపై ఊగిపోతూ.. మాట్లాడుతున్నాన‌ని.. వారాహికి, వ‌రాహికి తేడా తెలియ‌ని మ‌న సీఎం జ‌గ‌న్ చెప్పారంటూ.. ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. నేను ఊగిపోతూ మాట్లాడుతున్నాను. ఔను.. కోపం వస్తే ఎవరైనా ఊగిపోతారు.. తిరగబడతారు. నేను కూడా అంతే అని వ్యాఖ్యానించారు. ”గోదావరి జిల్లాల్లో నన్ను తిరగనివ్వద్దని వైసీపీ అనుకుంటోంది. భీమవరం గురించి ఏం తెలుసు అని వైసీపీ అంటోంది. భీమవరం నా నేలగా భావించా.. ఇక్కడే ఉంటా“ అని ప‌వ‌న్ చెప్పారు.