రాహుల్ సీరియస్..ఆ ఇద్దరు ఎవరు ?

ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం తర్వాత నేతల్లో టెన్షన్ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలనే విషయమై సీనియర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ స్ట్రాటజీ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలవ్వగానే కొందరు నేతలు ఫిర్యాదులు చేయటానికి రెడీ అయ్యారు. దాంతో రాహుల్ సీరియస్ అయ్యారు. స్ట్రాటజీ సమావేశం నిర్వహించింది ఫిర్యాదులు చేసుకోవటానికి కాదని గెలుపుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయటానికి మాత్రమే అన్నారు.

ఇదే సమయంలో టీ కాంగ్రెస్ లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలన్నీ తనకు తెలుసని చెప్పారు. నేతలంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ గీతదాటిన ముగ్గురిని గుర్తించామని, పద్దతి మార్చుకోకపోతే ఇద్దరిపై చర్యలు తప్పవని ఘాటుగానే హెచ్చరించారు. దాంతో గీతదాటిన ముగ్గురు ఎవరు, చర్యలు తప్పవని హెచ్చరించిన ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే విషయమై ఇపుడు చర్చలు జోరుగా జరుగుతోంది.

మరో ఆరుమాసాల్లో ఎన్నికలు పెట్టుకుని ఇంకా నేతలు తమలో తాము గొడవలు పడుతు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసుకుంటున్నారనే విషయంలో రాహూల్ చాలా సీరియస్ అయ్యారు. అందుకనే నేతల మద్య ఉన్న వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టేయమని పదేపదే చెబుతున్నారు. అయినా కొందరు నేతలు రాహుల్ చెప్పిన మాటలను, చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. దాంతో చాలామంది సినియర్ల మధ్య రెగ్యులర్ గా ఏదో విషయమై వివాదాలు రేగుతునే ఉన్నాయి.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం అధిష్టానంపై నోరుపారేసుకోవటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా నోరుపారేసుకుంటున్నది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి. వీళ్ళిద్దరు ఏదో కారణంగా తరచూ రేవంత్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతునే ఉంటారు. వీళ్ళిద్దరి కారణంగా మిగిలిన సీనియర్లు కూడా ఎంతోకొంత ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు రేవంత్ తో మాట్లాడరు, రేవంత్ ఆదేశాలను పట్టించుకోరు. ఇపుడు రాహుల్ చేసిన హెచ్చరికలు వీళ్ళని దృష్టిలో పెట్టుకునేనా అనే చర్చ జోరుగా జరుగుతోంది.