అక్టోబర్లోనే ఎన్నికల నోటిపికేషన్?

అక్టోబర్లోనే తెలంగాణా రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వబోతోందా ? అవుననే ప్రభుత్వవర్గాలు అనుమానిస్తున్నాయి. మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారులు ఈమధ్యనే తెలంగాణాలో పర్యటించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు జరిపారు. కొన్ని జిల్లాల్లో క్షేత్రస్ధాయి పర్యటనలు కూడా జరిపారు. తమకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని తీసుకున్నారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఎర్లీ పోల్స్ అనే సంకేతాలు అందినట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

నెలముందుగానే అంటే అక్టోబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ అవకాశాలున్నట్లు అర్ధమవుతోంది. అక్టోబర్లో నోటిఫికేషన్ అంటే నవంబర్లో ఎన్నికలు జరిగేందుకు అవకాశముంది. పోయిన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కాకుండా కేసీయార్ అసెంబ్లీని రద్దుచేయటంతో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నవంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరిపారు. తెలంగాణా అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగుస్తుందని ఈమధ్యనే కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 6, మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ గడువు జనవరి 3, రాజస్ధాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగుస్తుంది. కాబట్టి పై రాష్ట్రాల్లోని అధికారులను వెంటనే  బదిలీ చేయాలని కమీషన్ ఆదేశించింది. అలాంటి ఆదేశాలే తెలంగాణాకు కూడా అందాయట. ఓటర్లజాబితా సవరణ లాంటి విషయంలో కూడా కమీషన్ చాలా స్పీడుగా ఉంది.

జరుగుతున్నది చూస్తేంట తెలంగాణాలో నోటిఫికేషన్ అక్టోబర్ లోనే  వచ్చే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై రాజకీయపార్టీల్లో అవగాహన లేకపోతే సమాచారం ఉన్నట్లుంది. అందుకనే అన్నీ పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్నీ నియోజకవర్గాల్లో  అభ్యర్ధుల ఎంపికపై సర్వేలు చేయించుకుంటున్నాయి. పార్టీల విజయావకాశలపైన కూడా ప్రతినెలా సర్వేలు చేయించుకుంటు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నాయి. అంటే పార్టీల సంగతి వదిలేస్తే ఎన్నికల కమీషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగంపై రిపోర్టులు తెప్పించుకుంటునే ఉందని అర్ధమవుతోంది. అందుకనే పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి.