ఏపీ బీజేపీ … కొత్త రాజకీయం !

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఒక డేంజర్ గేమ్ ఆడుతోంది. అది ఆ గేమ్‌లో ప్రజలు బలవుతారో.. లేక ఆ పార్టీనే బలవుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. 2024లో భాజపా-జనసేన కూటమిదే ఏపీలో అధికారం అంటూ ఘనంగా ప్రకటించుకున్నారు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు. ఐతే దీన్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్లు ఆ పార్టీలో అయినా ఉన్నారా అంటే సందేహమే.

ఎందుకంటే తర్వాతి ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద పోరాడటం ప్రధానంగా చేయాల్సిన పని. కానీ అధికార పార్టీ కింద వైసీపీ మీద కాకుండా తెలుగుదేశం మీద పోరాడుతోంది భాజపా. సోము వీర్రాజు.. టీడీపీ పేరెత్తితే చాలు ఇంతెత్తున లేస్తున్నారు. కానీ అధికార పార్టీని ఒక్క మాటా అనట్లేదు.

ఇక వివిధ అంశాలపై భారతీయ జనతా పార్టీ వైఖరి అయోమయంగా ఉంటోంది. రాజధాని తరలింపు విషయంలో ఆ పార్టీ వైఖరి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటిదాకా కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండగా.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నది ఏపీ బీజేపీ వైఖరిగా కనిపించింది. కానీ ఇప్పుడు సోము వీర్రాజు వచ్చాక అమరావతి విషయంలో ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

పార్టీ పరంగా చూస్తే ఢిల్లీ నాయకులు ఒకలా మాట్లాడతారు. ఏపీ నాయకులు ఒకలా మాట్లాడతారు. ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తాయి. అమరావతి విషయంలో బీజేపీ మీద ఆశలు పెట్టుకున్న అక్కడి రైతులు.. ఇప్పడు ఆ పార్టీని విలన్‌ లాగా చూస్తున్నారు. సీనియర్ నేత రామ్ మాధవ్, టీడీపీ నుంచి వచ్చిన సుజనా చౌదరి లాంటి వాళ్లు అమరావతికి అనుకూలంగా మాట్లాడితే.. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాళ్లు భిన్న స్వరం వినిపిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విషయం జనాల్లోకి వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే.. అధికార పార్టీ మీద పోరాడితేనే అధికారం దక్కుతుందన్న వాస్తవం మరిచి.. ప్రతిపక్షం మీద వీర్రాజు అండ్ కో గయ్యిన లేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ఇలాగే ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు బీజేపీ అదే తప్పు చేస్తోంది. వైసీపీని ఒక్క మాటా అనకుండా టీడీపీని టార్గెట్ చేస్తోంది.

మొన్న విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన సందర్భంగా వీర్రాజు ప్రభుత్వం మీద ఓ మోస్తరుగా కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు. ఇలా వైసీపీని విడిచిపెట్టి టీడీపీనే టార్గెట్ చేస్తుంటే.. రేప్పొద్దున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ అయి టీడీపీకే పడతాయన్నది విశ్లేషకుల అంచనా. మరి బీజేపీ ఈ వాస్తవాన్ని ఎప్పుడు గ్రహిస్తుందో ఏమో.