మోడీ భయమే అందరినీ కలుపుతోందా ?

బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సమావేశానికి 15 ప్రతిపక్షాల అధినేతలు కలిశారు. ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోయినా ఇదే విధంగా మరిన్ని సమావేశాలు నిర్వహించాలని మాత్రం డిసైడ్ అయ్యింది. రెండో సమావేశం జూలైలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరగాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఒకటి రెండు సమావేశాలు జరిగిన తర్వాత కీలక అంశాలపై నిర్ణయాలుంటాయి.

సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతు పెద్ద నిర్ణయాలేవీ తీసుకోకపోయినా మంచి వాతావరణంలోనే సమావేశం జరిగినట్లు చెప్పారు. తర్వాత సమావేశం సిమ్లాలో జరుగుతుందన్నారు. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, ప్రతిపక్షాల విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత ధోరణి, ప్రతిపక్షాల నేతలపైకి దర్యాప్తు సంస్ధలను ప్రయోగించటం, ఫోన్లను ట్యాప్ చేయటం లాంటి అంశాలపై చర్చలు జరిగాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మొదటి సమావేశంలోనే ప్రతిపక్షాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాయని ఎవరు అనుకోలేదు. ఇక్కడ కీలకమైన నిర్ణయమంటే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ అన్న పద్దతిలో అభ్యర్ధులను నిలబెట్టడమే. నిజానికి ఇది చాలా కీలకమైన అంశం. అయితే మోడీకి భయపడే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావటానికి నాంది పడిందని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇపుడు హాజరైన ప్రతిపక్షాల్లో చాలావాటికి ఒకదానికి మరోదాదనితో పడదు. కాంగ్రెస్ అంటే తృణమూల్, ఆప్, ఎస్పీలకు ఏమాత్రం పడదు.

అలాగే ఆప్-ఎస్పీల మధ్య కూడా సఖ్యత లేదు. అయితే తమ మధ్య ఉన్న విభేదాలు తాత్కాలికంగా అయినా పక్కనపెట్టి ఒకచోట చేరాయంటే మోడీ అంటే ఉన్న భయమే తప్ప మరోటికాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ భయంతోనే రాబోయే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్ధాన్, తెలంగాణా ఎన్నికల్లో కూడా కలిసి పోటీచేస్తాయేమో చూడాలి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గనుక ప్రయోగం చేసి అదిగనుక సక్సెస్ అయితే రాబోయే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలను ఫైనల్ అనే అనుకోవచ్చు. బహుశా సిమ్లా మీటింగులో ప్రతిపక్షాల ఐక్యతపై మరింత క్లారిటి రావచ్చేమో.