పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం.. జాతీయ గేయం వందేమాతరంపై చర్చ జరిగింది. ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యాన్ని పురస్కరించుకుని చేపట్టిన చర్చలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే.. ఆయన తొలుత వందేమాతరం గొప్పదనాన్ని, నాటి బ్రిటీష్ హయాంలో ఈ గేయం ఎలాంటి అవమానాలకు, నిర్బంధాలకు గురైందో వివరించారు. అనంతరం… ఆయన తన వ్యాఖ్యల్లో పదును పెంచారు.
తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఆయన కుమార్తె.. ప్రధాని ఇందిరా గాంధీ వరకు.. జరిగిన పాలనలో వందేమాతరం పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో వందేమాతరం గేయం దేశాన్ని కదిలించిందని పేర్కొన్నారు. అలాంటి గేయాన్ని తొలి ప్రధాని నెహ్రూ తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ గేయాన్ని ఒక మతానికి అంటగట్టి.. నిషేధించాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వందేమాతరం గేయం.. ముస్లింలను అవమానించేలా.. వారిని రెచ్చగొట్టేలా ఉందని భావించిన నెహ్రూ దీనిని నిషేధించాలని చూశారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అందుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న వందేమాతరంలోని కొన్నిపంక్తులను నిర్దయగా తొలగించారని ఆరోపించారు. 1950లో అప్పటి దేశ భక్తులు.. పట్టుబట్టకపోతే.. వందేమాతరం జాతీయ గేయం అయి ఉండేది కాదని పేర్కొన్నారు. తర్వాత.. ఎమర్జెన్సీ(ఇందిరమ్మ పాలన)లోనూ వందేమాతరం నినాదం పెల్లుబికిందని తెలిపారు.
కొన్ని పంక్తులను తొలగించడం ద్వారా.. ఒక మతానికి అంటగట్టడం ద్వారా.. పశ్చిమ బెంగాల్ చరిత్రను కాలరాయాలని.. కాలగర్భంలో కలిపేయాలని ప్రయత్నించారని మోడీ ఆరోపించడంగమనార్హం. అంతేకాదు.. “వందేమాతరం రచించిన సమయంలో బ్రిటీష్ వారి నుంచి కూడా నిర్బంధం ఎదురైంద“ని గుర్తు చేశారు. బ్రిటిష్ జాతీయ గీతమైన `గాడ్ సేవ్ ద క్వీన్` గీతాన్ని ఆలపించేలా చేయాలని యత్నించారని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వందేమాతరం నేటికి 150 ఏట అడుగు పెట్టిందన్న ఆయన.. ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates