మీడియా ప్రముఖుడి అరెస్టు !

ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.

పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ అయ్యారని కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ నిధులను దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ గతంలోనూ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే తాజా అరెస్టులు జరిగినట్లుగా చెబుతున్నారు.

వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3300 కోట్ల ఆస్తుల్ని ఈడీ గతంలో జప్తు చేయటం గమనార్హం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో హాజరు పర్చిన అనంతరం రిమాండ్ కు తరలిస్తారు. కెనరా బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకుల నుంచి సుమారు రూ.1500 కోట్ల మేర మోసం చేసినట్లుగా వారిపై అభియోగాలు ఉన్నాయి. సంస్థకు చెందిన న్యూఢిల్లీ.. హైదరాబాద్.. గుర్ గావ్.. చెన్నై.. బెంగళూరులోని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.