ఏప్రిల్లోనే ఎన్నికలు..తేల్చేసిన చంద్రబాబు

రాబోయే ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు జరగబోతున్నట్లు చంద్రబాబునాయుడు తేల్చి చెప్పేశారు. చంద్రబాబు తాజా ప్రకటనతో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. హైదరాబాద్ లో చంద్రబాబుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తనపైన ఉందని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీకి దేశంలోనే ఎంతో పేరుందన్నారు. ఇలాంటి పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పాలనను అంతం చేయటానికి రెడీ అవుతున్నట్లు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయకపోతే రాష్ట్రం అధోగతి పాలవ్వడం తథ్యమన్నారు. రాష్ట్రాన్ని కాపాడి, డెవలప్ చేసే బాధ్యతను తాను తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో నేతలు, క్యాడర్ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ లో టీడీపీ పాత్రను ఎవరు మరచేందుకు లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో టీడీపీ చరిత్ర సృష్టించిందన్నారు. హైదరాబాద్ ఇపుడు ఈ స్థాయిలో ఉందంటే అదంతా తన వల్లే అని చంద్రబాబు చెప్పుకున్నారు.

తన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కంటిన్యూ చేయడం వల్లే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కానీ ఏపీలో అలా కాకుండా తాను చేసిన కొన్ని పనులను జగన్ విధ్వంసం చేసినట్లు మండిపడ్డారు. అమరావతి రాజధానిని నిర్మాణాన్ని జగన్ దెబ్బకొట్టినట్లు మండిపోయారు. అమరావతి నిర్మాణం జరిగుంటే ఈపాటికి లక్షల కోట్లరూపాయల సంపద సృష్టి జరిగేదన్నారు. రాష్ట్రమంతా డెవలప్ కావాలనే అమరావతిని తాను రాజధానిగా ఎంపికచేసినట్లు చంద్రబాబు చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది మాత్రం టీడీపీయే అని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే నేతలను, క్యాడర్ ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరు సమిష్టిగా కష్టపడాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తెలుగుదేశంపార్టీని ఎన్టీయార్ హైదరాబాద్ లోనే ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతి పేదవాడిని ధనికుడిగా చేయటమే తన లక్ష్యంగా ప్రకటించారు. ఇందుకోసం తాను ఎంతైనా కష్టపడతానని హామీఇచ్చారు.