బీజేపీ భారీ ప్రణాళిక

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది కమలనాదుల పట్టుదల. ఇందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెలలోనే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పర్యటించబోతున్నారు. ముగ్గురి రాక సందర్భంగా తెలంగాణాలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే విషయమై పార్టీ చీఫ్ బండి సంజయ్ సీనియర్లందరితోను మాట్లాడుతున్నారు.

బహిరంగసభలను సక్సెస్ చేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీనే అనే సంకేతాలను జనాలకు ఇవ్వాలన్నది బీజేపీ నేతల టార్గెట్. గడచిన తొమ్మిదేళ్ళుగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమపథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఇది సరిపోవన్నట్లుగా అవకాశం ఉన్న ప్రతిచోట భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. బండి ఇప్పటికే మూడుసార్లు పాదయాత్రల పేరుతో జనాల్లో విస్తృతంగా తిరిగారు.

ఒకవైపు ఇవన్నీ చేసుకుంటునే మరోవైపు ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయంమీద కూడా నేతలు దృష్టిపెట్టారు. ఇతరపార్టీల్లోని నేతలను చేర్చుకునేందుకు ఈటల రాజేందర్ లాంటి నేతలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావటంలేదు. కాంగ్రెస్ లో నుండి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప ఇంకెవరు చేరలేదు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, లింగయ్య గౌడ్ లాంటి నేతలు బీఆర్ఎస్ నేతలు చేరారు. ఇదంతా కూడా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల నేపధ్యంలో జరిగింది.

అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ బీజేపీ వైపు కూడా చూడలేదు. ఇంతలో కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటం కూడా బీజేపీ ప్రయత్నాలకు గండికొట్టింది. సో ఇపుడు నేతలను చేర్చుకునే విషమం మీద కూడా అమిత్ , జేపీ నడ్డాలు సీరియస్ గా దృష్టిపెట్టారట. ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్న నేతలను గుర్తించి అలాంటివారిని డైరెక్టుగా అమిత్ షా తోనే చర్చలు జరిపేట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ మోడీ, అమిత్, నడ్డాల బహిరంగసభలకు ముందే జరిగిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ఇం ఎంతోకాలం లేదుకాబట్టే.