అదంతా మోడీ ఘనత.. కానీ ఇప్పుడు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో మెజారిటీ జనాల్లో ఉన్న అభ్యంతరం ఆయన ప్రచార పిచ్చి గురించే. సమయం సందర్భం చూడకుండా పబ్లిసిటీ కోసం ఆయన పడే తాపత్రయం గురించి అందరికీ తెలుసు. కరోనా టైంలో జనాలు అల్లాడిపోతుంటే.. నెమళ్లతో ఫొటో షూట్లు చేయించుకున్న తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. ఇక గత కొన్ని నెలల్లో ఆయన తన ప్రమోషన్ కోసం బాగా ఉపయోగించుకున్నది ‘వందే భారత్’ రైలునే.

దేశంలో కొత్తగా పలు ప్రాంతాల్లో ఒక రైలును ప్రవేశ పెడితే.. ప్రధాని ఎక్కడో ఒక చోట ప్రారంభోత్సవానికి హాజరవుతారు. కానీ మోడీ మాత్రం వాయిదాల పద్ధతిలో ఒక్కో సిటీలో ఈ రైలును మొదలుపెట్టించి.. ప్రతి వేడుకకూ హాజరయ్యారు. తన ప్రమోషన్ కోసం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మామూలుగా వాడుకోలేదు మోడీ. ఆ సమయంలో దేశానికి రైల్వే మంత్రి అంటూ ఒకరున్న విషయం కూడా ఎవరికీ గుర్తు రాలేదు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదలైనపుడు ప్రారంభోత్సవంలో, అలాగే మీడియాలో హైలైట్ కావాల్సిన రైల్వే మంత్రి అసలు సోదిలో లేకుండా పోయారు. ఆ క్రెడిట్ కేవలం మోడీకి మాత్రమే దక్కింది. ఆయన ప్రచారానికి ‘వందే భారత్’ బాగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఒరిస్సాలో ఘోర రైల్వే ప్రమాదం చోటు చేసుకున్నపుడు మాత్రం మోడీ తెర వెనక్కి వెళ్లిపోయారు. ఇది రైల్వే శాఖ ఘోర వైఫల్యానికి నిదర్శనంగా మారిన సందర్భంలో రైల్వే మంత్రి పేరే వినపడుతోంది.

ఇన్నాళ్లూ మనకొక రైల్వే మంత్రి ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు మీడియాలో మంత్రి అశ్విని వైష్ణవే ముఖచిత్రంగా మారారు. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే మోడీకి క్రెడిట్ ఇస్తూ ఆయనకు మామూలు ఎలివేషన్ ఇవ్వరు బీజేపీ వాళ్లు. కానీ కర్ణాటకలో ఓడిపోతే అది మోడీ ఖాతాలో వేయకుండా జేపీ నడ్డాను తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వానికి సంబంధించి క్రెడిట్ వచ్చే విషయమైతే మోడీ ముందుకు వస్తారని.. వైఫల్యాన్ని మాత్రం వేరే వాళ్ల మీదికి నెట్టేసి ఆయన సైడ్ అయిపోతారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.