చంద్రబాబు అవసరం గుర్తుకొచ్చిందా ?

తెలంగాణాలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో బీజేపీకి చంద్రబాబునాయుడు అవసరం గుర్తుకొచ్చింది. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమి బీజేపీ అగ్రనేతల మీద బాగానే ప్రభావం చూపినట్లు అర్ధమవుతోంది. కర్నాటకలో ఓటమితో దక్షిణాదిలో బీజేపీ ఉనికి కోల్పోయింది. కోల్పోయిన ఉనికిని మళ్ళీ తెచ్చుకోవాలంటే అంత తేలిక కాదు. పైగా ఈ ఏడాది చివరలోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తెలంగాణా కూడా ఒకటి. తెలంగాణాలో ఎలాగైనా గెలవాలని బీజేపీ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నది.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే బీజేపీకి అంతసీన్ కనబడటంలేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్ధులే లేరు. ఎంతసేపు కేసీయార్ తో పాటు కేసీయార్ కుటుంబాన్ని తిట్టడం, ఓల్డ్ సిటిలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రమాణాలకు చాలెంజులు విసరటంతోనే పార్టీ చీఫ్ బండి సంజయ్ రోజులు గడిపేస్తున్నారు. మిగిలిన సీనియర్ నేతల వ్యవహారం కూడా ఇందుకు తగ్గట్లే ఉంది. అందుకనే సుమారు 65 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీలకు సవాలు విసిరేంత స్ధాయిలో గట్టి నేతలు లేరు.

ఈ కారణంగానే ఇతర పార్టీల నుండి వలసలను బీజేపీ ప్రోత్సహిస్తోంది. అయినా ఎవరూ కమలంపార్టీవైపు చూడటంలేదు. మరీ పరిస్ధితుల్లో ఏమిచేయాలి ? ఏమిచేయాలో దిక్కుతోచకే మళ్ళీ చంద్రబాబు వైపు చూపుసారించినట్లుంది. అందుకనే ఢిల్లీకి వచ్చి కలవాలని అమిత్ షా నుండి చంద్రబాబుకు పిలుపొచ్చింది. చాలాకాలంగా చంద్రబాబు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి  వెంటనే ఢిల్లీ చేరుకుని అమిత్ షా తో భేటీ అయ్యారు.

తెలంగాణాలో బీజేపీకి టీడీపీ సహకారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణాలో టీడీపీ దాదాపు దెబ్బతినేసిందన్నది వాస్తవమే. అయితే క్యాడర్ ఇంకా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి సుమారు 5 వేల ఓట్లవరకు ఉన్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ ఓట్లే కీలకమయ్యే అవకాశాలున్నాయి. అందుకనే అర్జంటుగా టీడీపీతో పొత్తుపెట్టుకుని ఆ ఓట్లను బీజేపీకి వేయించేట్లుగా చంద్రబాబుతో అమిత్ మాట్లాడారట. తొందరలోనే మరో మీటింగ్ ఉంటుందని అప్పటికి మరింత క్లారిటి వస్తుందని తమ్ముళ్ళు చెబుతున్నారు.