చంద్రబాబు సీరియస్ వార్నింగ్

క్రమశిక్షణ గీతదాటుతున్న తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు సీరియస్ గా వార్నింగిచ్చారు. క్రమశిక్షణ తప్పుతున్న నేతలు ఎవరినీ వదిలిపెట్టేది లేదని గట్టిగానే చెప్పారు. నేతలు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని గట్టిగా వర్నింగ్ ఇచ్చారు. పార్టీనేతల సమావేశంలో కొందరు సీనియర్లు ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలో కోడెల శివరామ్, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ అధినేతనే ప్రశ్నిస్తు మీడియాలో మాట్లాడారు.

సత్తెనపల్లిలో ఇన్చార్జి పదవి ఇవ్వటం, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటంపై చంద్రబాబును ఉద్దేశించి కోడెల మీడియాతో మాట్లాడారు. తన తండ్రి కోడెల శివప్రసాద్ మరణించినపుడు జరిగిన పరిణామాలను, తర్వాత జరిగిన డెవలప్మెంట్లలో చంద్రబాబును తప్పుపడుతు మీడియాతో మాట్లాడారు. కన్నాలక్ష్మీనారాయణను ఇన్చార్జిగా నియమించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోడెల దగ్గరకు ఇద్దరు పార్టీ నేతలను చర్చలకు పంపినా పెద్దగా ఫలించలేదు.

ఇదే సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో టికెట్ విషయమై మాజీమంత్రి ప్రత్తిపాటి కూడా డైరెక్టుగా చంద్రబాబును నిలదీశారు. ఫౌండేషన్లు, ట్రస్టులు పెట్టుకుని కాస్త హడావుడి చేసి తోపుడు బండ్లు ఇచ్చినంత మాత్రాన టికెటి ఇచ్చేస్తారా అంటు చంద్రబాబును నిలదీశారు. ఇక్కడ కొంతకాలంగా భాష్యం ప్రవీణ్ టికెట్ కోసం చాలా హడావుడి చేస్తున్నారు. పార్టీకి రు. 78 లక్షల విరాళమిచ్చారు. నియోజకవర్గంలో బాగా డబ్బులు ఖర్చుచేస్తు బాగా యాక్టివ్ గా తిరుగుతున్నారు. భాష్యం వ్యవహారం ప్రత్తిపాటిలో బాగా టెన్షన్ పెంచేసినట్లుంది.

అందుకనే ఆ అసహనాన్ని మీడియా ముందు తీర్చుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే చంద్రబాబు సీరియస్ వార్నింగిచ్చారు. క్రమశిక్షణ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. అసంతృప్తి ఏదన్నా ఉంటే నేరుగా తనతోనే లేకపోతే పార్టీలో ముఖ్యనేతలతో చెప్పుకోవాలి కానీ మీడియాలో మాట్లాడటం ఏమిటంటు మండిపోయారు. కోడెల, ప్రత్తిపాటిని తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఒకవేళ అంత సమయం లేకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అసమ్మతి లేదా అసంతృప్తిని మొగ్గలోనే తుంచేయకపోతే అదే బాగా పెరిగిపోయి మహావృక్షమవుతుందని చంద్రబాబుకు తెలీదా ?