రెండేళ్ల‌లోనే ఏపీని స‌న్‌రైజ్ రాష్ట్రంగా మారుస్తా: చంద్ర‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లోనే సన్ రైజ్ ఏపీగా మారుస్తాన‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. జూన్ 2.. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజని, గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. నవనిర్మాణ దీక్షతో ప్రజల్లో ఒక చైత్యన్యం తెచ్చామని చంద్రబాబు తెలిపారు.

పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నామని చంద్ర‌బాబు తెలిపారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మధ్యలో రాజధాని పెట్టామని, రాజధాని కంటిన్యూ అయి ఉంటే.. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చుండేదని చంద్రబాబు తెలిపారు. నీతిఆయోగ్ సూచనల మేరకే పోలవరం నిర్మాణం ఏపీకి అప్పజెప్పారని చంద్ర‌బాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశాక.. పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారని దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీలో ఎఫ్‌డీఐలు(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు) అథ‌మ స్థానంలో ఉన్నాయన్నారు. ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే.. గంజాయి హబ్‌గా మార్చారని దుయ్య‌బ‌ట్టారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్శిటీలు తెచ్చామ‌న్నారు. విజయనగరంలో గిరిజన వర్శిటీకి భూమిస్తే.. వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు. అమరావతి-అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేయాలని భావిస్తే.. అమరావతి-ఇడుపులపాయకు ఆ రోడ్డు మార్చారని, వాళ్ల వ్యాపారాల కోసమే వైసీపీకి సీట్లు ఇచ్చినట్లు అయిందని చంద్రబాబు విమర్శించారు.

త‌న‌పై ఉన్న వివిధ కేసుల్లో సీబీఐ అరెస్ట్ చేయకుంటే చాలని సీఎం జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఏపీకి, తెలంగాణకు ఆదాయంలో రూ.11,600 కోట్లు తేడా ఉందని తెలిపారు. పేటీఎం బ్యాచ్ దీనికేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఏపీ అనాధగా మారిందని, దీన్ని పునర్నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకటో తేదీన జీతాలివ్వమని ఉద్యోగులు అడిగితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు డబ్బుల పిశాచాల్లా తయారయ్యారని ధ్వజమెత్తారు. ‘‘సీఎంకు తెలివి తేటలు ఎక్కువ. ఏ యూనివర్శిటీలో చదివారో మాత్రం చెప్పరు. టీడీపీ మేనిఫెస్టో అద్భుతమని స్వయంగా జగనే చెప్పారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.