అప్రూవర్ వల్ల ప్రముఖుల్లో పెరిగిపోతున్న టెన్షన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటివరకు స్కామ్ నిందితుల్లో ఒకడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. స్కామ్ లో చాలామంది ప్రముఖులున్నారు. వీరిలో కొందరు ఢిల్లీకి చెందిన వారైతే మరికొందరు దక్షణాదికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో కూడా ముఖ్యలు తెలంగాణాలో కల్వకుంట్ల కవిత, ఆమె తరపు వాళ్ళు. అలాగే ఏపీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి.

ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే స్కామ్ లో ఇప్పటికే చాలామంది పాత్రపై సీబీఐ, ఈడీలు అవసరమైనన్ని సాక్ష్యాలను సేకరించింది. అయితే కవిత పాత్రే ఆధారాలతో సహా ఇంకా బయటపడలేదు. కవితను దర్యాప్తుసంస్ధలు ప్రశ్నించినా ఏ విధమైన ఆధారాలను సేకరించిందో ఎటువంటి వివరాలను సంపాదించిందో తెలీదు. అయితే సౌత్ గ్రూప్ తరపున కవితే సూత్రదారని ఈడీ తన చార్జిషీట్లో చాలాసార్లు చెప్పింది. కొన్నిసార్లు కవిత పాత్రను చార్జిషీట్లో ప్రస్తావిస్తే ఒకటిరెండుసార్లు కవితపేరు లేకుండానే చార్జిషీట్ దాఖలు చేసింది.

దీనికి కారణం ఏమిటంటే కవిత బినామీగా స్కామ్ లో ఉన్నట్లు మొదట అంగీకరించిన అరుణ్ రామచంద్రపిళ్ళై తర్వాత అడ్డం తిరగటమే. కవిత పాత్రకు సంబందించి పిళ్ళై ఇచ్చిన వాగ్మూలమే చాలా కీలక ఆధారం. అయితే పిళ్ళై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు చెప్పారు. దాంతో ఈడీకి ఏమిచేయాలో అర్ధంకాలేదు. అందుకనే స్కామ్ లో కవిత పేరు ప్రస్తావనకు వస్తోంది కానీ తిరుగులేని ఆధారాలంటు పెద్దగా లేవు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిందితుల్లో ఒకడైన శరత్ అప్రూవర్ గా మారిపోవటం సంచలనంగా మారింది. శరత్ అప్రూవర్ గా మారిపోతే స్కామ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. స్కామ్ సూత్రదారులెవరు, పాత్రదారులెవరు ? ఎవరి వాటా ఎంతన్న విషయాలు మొత్తం బయటపడతాయి. అందుకనే ఇపుడు వైసీపీ ఎంపీ మాగుంట, కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనీల్, పిళ్ళై, ఆప్ ప్రముఖులు మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ లాంటి వాళ్ళందరి విషయాలు బయటపడతాయి. అందుకనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.