వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ఒంగోలు కుత‌కుత‌!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌తిప‌క్షం జ‌న‌సేన‌ల మ‌ధ్య రాజ‌కీయం గ‌రంగరంగా మారింది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న ట్వీట్లు.. వేస్తున్న కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు కౌంట‌ర్‌గా వైసీపీ నుంచి కూడా అదేరేంజ్‌లో కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. అయితే.. ఇవి మ‌రింత ముదిరి.. ఫ్లెక్సీల దాకా వ‌చ్చాయి. ఒక‌రికి వ్య‌తిరేకంగా ఒక‌రు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల కింద‌ట గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది.

ఇప్పుడు తాజాగా  ఒంగోలులో అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పేదలకు, పెత్తందారు లకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో  వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పవన్‌ కల్యాణ్ పల్లకి మోస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఈ ఫ్లెక్సీలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని కలిగించే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని జనసేన ఆందోళనకు దిగింది. ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేసింది.

అలాగే వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “రాక్షస పాలనకి అంతం- ప్రజా పాలనకి ఆరంభం” అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జగన్ ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో వైఎస్ వివేకానంద రెడ్డి తల. దుష్ట శక్తులపై విల్లు ఎక్కుపెట్టినట్లు పవన్ కళ్యాణ్ ఫొటో’’ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. జనసేన ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు యత్నించగా.. జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులురంగంలోకి దిగి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌నుఅ దుపులోకి తీసుకుని స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.