ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. క‌విత‌కు సీబీఐ ట్విస్ట్

దేశాన్ని.. ముఖ్యంగా తెలంగాణ‌ను భారీ రేంజ్‌లో కుదిపేసిన‌.. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టివ‌ర‌కు తెలంగాణ సీఎం కుమార్తె, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌ను అరెస్టు చేసేస్తార‌నే వార్త‌లు వ‌చ్చేశాయి. దీంతో ఇది పెను సంచ‌ల‌నంగా మారింది. అయితే.. తాజాగా ఈ కేసులో సీబీఐ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో  అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసిన సీబీఐ.. దానిలో ఎక్క‌డా క‌విత పేరును ప్ర‌స్తావించ‌లేదు.

ఈ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్‌లపై అభియోగాలు మోపింది.  అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని ఢిల్లీ వేదికగా చర్చలు నడుస్తున్నాయి.  గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్‌షీటులో ఎక్కడా కవిత పేరు కనపడక‌పోవ‌డం.. రాష్ట్రంలోనూ ఆస‌క్తిగా మారింది.

నిజానికి ఇప్ప‌టికి చాలా సార్లు సీబీఐ క‌విత‌ను ప్ర‌శ్నించింది. హైద‌రాబాద్‌లో ఆమె ఇంటికి ఒక‌సారి.. త‌ర్వాత ఢిల్లీలో మూడు సార్లు క‌విత‌ను ప్ర‌శ్నించింది. ఒక ద‌శ‌లో ఆమె అరెస్టు కూడా ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే.. కవితను అన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ వచ్చినట్లేనని రాజ‌కీయ నేత‌లు భావిస్తున్నారు.

ఇక‌,  మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధల్‌లకు మాత్రం ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్- 25న సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ విచారణకు రాగా కవిత పేరు లేదనే విషయం వెలుగుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తదుపరి విచారణ జూన్-2కి కోర్టు వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.