అవినాష్ చుట్టూ బంగార్రాజులు.. ఏం చేస్తున్నారంటే..!

ఏపీలో ఏం జ‌రిగినా బెట్టింగు రాయ‌ళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వ‌ర‌కు దేనినీ వారు వదిలి పెట్ట‌డం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ.. సీఎం జ‌గ‌న్‌కు త‌మ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి వ్య‌వ‌హారం కూడా .. బెట్టింగుల‌కు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయ‌రా? అనేది తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసింది.

ఒక‌వైపు న్యాయ‌స్థానాల్లో ముంద‌స్తు బెయిల్ కోసం అవినాష్‌రెడ్డి పిటిష‌న్ చేయ‌డం.. మ‌రోవైపు సుప్రీం కోర్టు ఆయ‌న అరెస్టును నిలువ‌రించ‌లేమ‌ని చెప్ప‌డం.. సీబీఐ చేస్తున్న విచార‌ణ‌కు కితాబు లివ్వడం వంటి ప‌రిణామాలు.. మ‌రింత‌గా వేడి పెంచాయి. ఈ నేప‌థ్యంలో అవినాష్ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ.. ఆస‌క్తిని రేపుతోంది.ఈ క్ర‌మంలో కొందరు ఆయ‌న అరెస్టు అవుతారని… మరి కొందరు అవినాష్‌ అరెస్టు కారంటూ బెట్టింగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

క‌డ‌ప జిల్లా పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్ర‌మంలో డ‌బ్బులు కూడా చేతులు మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్క‌ర‌రెడ్డిని, ఆయ‌న‌కు ముందు గ‌జ్జ‌ల ఉద‌య్ కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన ద‌రిమిలా.. ఇప్పుడు అవినాష్ వ్య‌వ‌హారం చుట్టూనే కీల‌క‌చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక, సీబీఐ ఇప్ప‌టికే నాలుగు సార్లు.. ప‌లు ద‌ఫాలుగా అవినాష్‌రెడ్డిని విచారించింది. ఇటీవ‌ల‌ రోజు వారీ విచార‌ణ చేప‌డుతోంది. పైగా సాక్షి నుంచి నిందితుడు అని కూడా అవినాష్‌ను మార్చింది. ఈ క్ర‌మంలో రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో అవినాష్‌రెడ్డి అరెస్టు త‌ప్ప‌ద‌నే చ‌ర్చ న‌డుస్తుండ‌గా.. సీబీఐ మాత్రం చాలా ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియ‌దు కానీ.. బెట్టింగురాయుళ్లు మాత్రం అదిగో అరెస్టు.. ఇదిగో అరెస్టు అంటూ.. పందేలు క‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నూలులో గ‌త నాలుగు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ పందేల‌కు మ‌రింత డిమాండ్ పెరిగింది.