ఎంఎల్ఏలకు నో ఎంట్రీ?

ప్రగతి భవన్లోకి ఎంఎల్ఏలకు నోఎంట్రీ బోర్డు కనబడుతోందట.  ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కేసీయార్ ను కలిసి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడుదామని, పరిష్కారలపై చర్చించాలని అనుకుంటున్న ఎంఎల్ఏలకు ప్రగతిభవన్లోకి నోఎంట్రీ బోర్డు కనబడుతోందని సమాచారం. గడచిన వారంరోజులుగా ముందుగా అపాయిట్మెంట్ తీసుకోకుండా నేరుగా వచ్చేస్తున్న ఎంఎల్ఏలను లోపలకు పంపటంలేదట. గేటు దగ్గరే సెక్యూరిటి వాళ్ళు ఆపేసి పంపేస్తున్నారట. వచ్చిన ఎంఎల్ఏకి అపాయిట్మెంట్ ఉందా లేదా అన్నది సెక్యూరిటి వాళ్ళు కనుక్కుంటున్నారట.

ముందుగా అపాయిట్మెంట్ తీసుకున్నారు అని సమాచారం వస్తే మాత్రమే లోపలకు ఎలౌ చేస్తున్నారట లేకపోతే బయటనుండి బయటకే పంపేస్తున్నారట. ఒకపుడు ఇదే ప్రగతిభవన్లోకి ఎంఎల్ఏలకు ఎంట్రీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండేవికావు. ఫాం హౌస్ లో ఉన్నపుడు కేసీయార్ ఎవరినీ కలిసేది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రగతిభవన్లో మాత్రం అభ్యంతరాలు లేకుండా ఎంఎల్ఏలకు ఎంట్రీ ఉండేది. అయితే ఎప్పుడైతే కొత్త సెక్రటేరియట్ ప్రారంభమైందో అప్పటినుండే నో ఎంట్రీ బోర్డు పడుతోందని సమాచారం.

ఇపుడు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్ పంచాయితి పెరిగిపోతోంది. ఒక వేదికమీదేమో ఎంఎల్ఏలందరికీ టికెట్లిస్తానని కేసీయార్ ప్రకటిస్తారు. మరోసారేమో సర్వేల్లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రానివాళ్ళకు టికట్ డౌటే అని పరోక్షంగా చెబుతారు. సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పింది నిజమే అయితే మళ్ళీ నియోజకవర్గాల్లో సర్వేలు ఎందుకు చేయిస్తున్నట్లు ? ఇక్కడే కేసీయార్ వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అందుకనే కేసీయార్ ను కలుసుకుని తమకు టికెట్లను ఖరారు చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఎంఎల్ఏలు ప్రగతిభవన్ కు క్యూ కడుతున్నారు. ఎన్నికల ముందు కాకపోతే సీఎం ను కలవాల్సిన అవసరం మంత్రులకు, ఎంఎల్ఏలకు ఏముంటుంది ? ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరం వచ్చినపుడు మాత్రమే సీఎంను కలుస్తారు ఎంఎల్ఏలు. ప్రగతిభవన్లో నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నా సెక్రటేరియట్ లో అందరినీ కేసీయార్ కలుస్తున్నారు. అయితే సెక్రటేరియట్ లో రోజూ చాలామంది వస్తుంటారు కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడేందుకు అవకాశాలుండవు. అందుకనే ప్రగతిభవన్ కు క్యూ కడుతున్నారు. అపాయిట్మెంటేమో  తొందరగా దొరకదు, అపాయిట్మెంట్ లేకపోతే లోపలకు వెళ్ళనివ్వటంలేదు. మరేం చేయాలన్నదే అసలైన సమస్య.