కేజ్రీ, కవిత వెంటపడుతున్న సుఖేష్

kavitha

ఢిల్లీ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖరన్ వారానికి ఒక లేఖను విడుదల చేయటం ద్వారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితలను బాగా చికాకుపెడుతున్నాడు. ఇప్పటికే ఒకసారి కేజ్రీవాల్ ఇంటి ఫర్నీచర్ బిల్లులను తానే చెల్లించానని చెప్పి కొన్ని ఆధారాలంటు మీడియాకు అందించాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితకు తాను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో కోట్ల రూపాయలున్న బ్యాగును కారులో పెట్టి అందిచానని చెప్పాడు. దానికి ఆధారంగా ఏదో ఒక కారు నెంబర్, వాట్సప్ చాటింగ్ స్ర్కీన్ షాట్లను విడుదలచేశాడు.

మొదటినుండి కారణాలు తెలీదుకానీ కేజ్రీవాల్, కవితలపైనే సుఖేష్ ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నాడు. మనీల్యాండరింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, మోసాలు తదితర కేసుల్లో ఇరుక్కుని సుఖేష్ జైలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బహుశా సుఖేష్ పైన కేసులు పడకుండా జైలుకు వెళ్ళకుండా తాము కాపాడుతామని ఎవరైనా హామీ ఇచ్చారేమో. అయితే హామీఇచ్చి మాట తప్పినందుకే ఏమో ఇపుడు కేజ్రీ, కవిత వెంటపడుతున్నాడు సుఖేష్.

తాజాగా కేజ్రీ ఇంటి ఫర్నీచర్ కు కవితే డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు చేశాడు. మూడు విడతల్లో కవిత రు. 80 కోట్లను చెల్లించినట్లు చెప్పాడు. ఫర్నీచర్ కు రు. 80 కోట్లు ఎందుకవుతుందో అర్ధంకావటంలేదు. కవితకు షెల్ కంపెనీ ఖాతాలున్నాయని అందులో నుండే మారిషస్ లోని గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్ కంపెనీకి కోట్లాది రూపాయలు బదిలీ అయినట్లు ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన బిల్లులు, వివరాలను తొందరలోనే బయటపెడతానని చెప్పాడు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేజ్రీ అధికారిక నివాసం కోసం కొన్న ఫర్నీచర్ కు కవిత డబ్బులు చెల్లించిందని చెప్పాడు. అధికారిక నివాసానికి ప్రభుత్వమే ఖర్చులు పెడుతుంది కానీ ఇంకెవరో ఖర్చులు పెట్టాల్సిన అవసరంలేదు. పైగా ఫర్నీచర్ కే రు. 80 కోట్లంటే నమ్మేట్లుగా లేదు. గతంలో ఫర్నీచర్ కు రు. 15 కోట్లని చెప్పినట్లు గుర్తు. సుఖేష్ చేస్తున్నది, మాట్లాడుతున్నది అంతా చూస్తుంటే తాను కేసుల్లో నుండి బయటపడేందుకు ప్రముఖులందరిపైనా బురదచల్లుతున్నాడనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.