రూ. 10 వేల కోట్లు పది మెలికలు

కేంద్రం నుంచి పది వేలకోట్లు తీసుకొచ్చి జగన్‌ విజయం సాధించారని అనుకుంటున్న వైసీపీ నేతలకు….అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. వచ్చిన డబ్బును వాడేసుకునే హడావిడిలో ఉన్న అధికారులకు…. వచ్చిన ఉత్తర్వుల్లో నాలుగో నిబంధన చదివిన తర్వాత మైండ్‌బ్లాంక్‌ అయింది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెవెన్యూలోటుతో ఏర్పడిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం 2014-15 ఆర్థికసంవత్సరంలో సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాన్ని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంతో పాటు, అప్పటి గవర్నర్ కూడా కేంద్రానికి నివేదించారు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఆర్థికమంత్రికి విన్నవించినా… రెవెన్యూ లోటును మాత్రం ఇవ్వలేదు. పదే పదే కోరినా 139 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నామంటూ బుకాయించారు. అయితే ఇటీవల జగన్ లేఖ రాసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం 2014-15 ఆర్ధిక లోటుకు సంబంధించి 10 వేల 460 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ లేఖ విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్ర ఖజానాకు కూడా జమవుతున్నాయి.

అయితే ఈ నిధుల వినియోగానికి సంబంధించి కేంద్రం అనేక షరతులు విధించింది. నిధుల వినియోగంలో ఆయా ప్రాజెక్టుల కింద రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తే సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలని సూచించింది. నిధులు వినియోగంపై సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం, అమలు జరిపే శాఖ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. అదే విధంగా, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సంబంధిత శాఖ కేంద్రానికి పంపాలని సూచించారు. ఇక్కడి వరకూ షరతులు బాగానే ఉన్నాయి. అస్సలు ఫిటింగ్ అంతా కేంద్రం పంపించిన సర్క్యులర్‌లోని నాలుగో నిబంధనలో ఉంది.

ప్రస్తుతం ఈ నిధులను వినియోగిస్తున్న ప్రాజెక్ట్‌లకు భవిష్యత్తులో కేంద్రంనుంచి ఎటువంటి ఆర్థిక సహాయం ఉండబోదని తేల్చేశారు. నాలుగో నిబంధనలో ప్రస్తావించిన ఈ షరతులతో ఇప్పుడు రాష్ట్రానికి ఇబ్బందులు ఖాయమని తేలిపోయింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్ట్‌, మరే ఇతర ప్రాజెక్ట్‌కు వినియోగిస్తారో ఆ ప్రాజెక్ట్‌లకు ఇక కేంద్రం నుంచి ఎటువంటి నిధులురావని, అదే విధంగా కేంద్రం ఆర్థికసాయం చేసే ప్రాజెక్ట్‌లకు కూడా నిధులు ఇవ్వబోమని నాలుగో నిబంధనలో స్పష్టం చేశారు. నిధులు వచ్చాయనే సంతోషంకంటే విధించిన నిబంధనలను ఆలస్యంగా తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థికశాఖ అధికారులు మాత్రం షాకయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కోలుకోలేని దెబ్బ తగిలిందని వాపోతున్నారు…