మోడీ మాటే వేదం.. ప్ర‌ధానిగా ఆయ‌న‌కే మార్కులు.. !

దేశంలో ప్ర‌ధాన మంత్రి పీఠం అధిరోహించేందుకు లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఒక‌రికిమించి ఎక్కువ‌గానే ఈ జాబితా ఉంది. ఈ కార‌ణంగానే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం గా కూట‌మి క‌ట్టే ఆలోచ‌న‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులు పడుతున్నాయి. గ‌తంలోనూ ఇలానే తృతీయ ప‌క్షం ఏర్పాటుకు ప్ర‌ధాని పీఠ‌మే అడ్డంకిగా మారింద‌నే చ‌ర్చ న‌డిచింది. ప్రాంతీయ స్థాయిలో బ‌లంగా ఉన్న నాయ‌కులు కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావించ‌డ‌మే దీనికి కార‌ణం.

ఇక‌, ఇప్పుడు మ‌రో 10 మాసాల్లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో తాజాగా దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన స‌ర్వేలో అస‌లు ప్ర‌ధానిగా ఎవ‌రు ఉంటే బాగుంటుంద‌నే ఆస‌క్తి క‌ర ప్ర‌శ్న‌కు ప్ర‌జ‌లు స‌మ‌ధానాలు చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 43% మంది ప్రధానిగా మోడీకే జైకొట్టారు. 2019తో పోలిస్తే.. మోడీ ఒక శాతాన్ని కోల్పోయినా.. ఆయ‌న ప్ర‌ధానిగా ఉండేవారి సంఖ్య వంద‌కు 43 ఉండ‌డం విశేషం. ఇదేస‌మ‌యంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు శ్రీముఖం చూపించారు.

రాహుల్‌గాంధీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కేవ‌లం 12 నుంచి 13 శాతం మంది కోరుకుంటే.. ఆయ‌న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా లేదా.. పార్ల‌మెంటుకు ఎన్నిక కావాల‌ని కోరుకున్న‌వారు.. 24% నుంచి 27శాతానికి పెరిగారు. ఇక‌, అవ‌కాశం ద‌క్కితే ఢిల్లీ గ‌ద్దె ఎక్కాల‌ని చూస్తున్న ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఈ రేసులో 4 శాతం ద‌గ్గ‌రే ఆగిపోయారు. అదేస‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను కూడా కేవ‌లం 4 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే ప్ర‌ధాని అవ్వాల‌ని కోరుతున్నారు.

ఇక‌, యూపీ మాజీ సీఎం, ఎస్పీ నాయ‌కుడుఅఖిలేశ్‌యాదవ్‌కు 3%, ప్రధాని రేసులో ఉన్నానంటూ పదేపదే ప్రకటించే నితిశ్‌కుమార్‌కు 1% మంది జైకొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అత్యంత దారుణంగా 0.2 శాతం మంది కోరుకున్నారు. ఇదిలావుంటే..అస‌లు మోడీని మూడోసారి కూడా ప్ర‌ధాని కావాల‌ని కోరుకోవ‌డం వెనుక‌.. ఆయ‌న వాగ్ధాటి కీల‌కంగా మారింది.

25% మంది ప్ర‌జ‌లు ఆయన ప్రసంగాలను ఇష్టపడతామని చెప్పారు. 20% మంది మోడీ చేసిన అభివృద్ధిని, 13% మంది కష్టపడి పనిచేసే తత్వాన్ని, 11% మంది ఆయన విధానాలను ఇష్టపడతామని చెప్పారు. మ‌రి ప్రాంతీయ పార్టీల‌కు చెందిన నేత‌ల‌పై.. మాత్రం.. ప్ర‌ధానిగా క‌న్నా.. ముఖ్య‌మంత్రులుగానే వారు రాణిస్తార‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.