పాలేరులో షర్మిల డబ్బు సంచులు

తెలంగాణలో రాబోయేది తమ పార్టీ ప్రభుత్వమేనని చెప్పుకునే వైఎస్ షర్మిల ఇప్పుడు తనకు అంత సీన్ లేదన్న వాస్తవం తెలుసుకుని ఓట్లు ఎక్కువ రాలే అవకాశమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. ఖమ్మం నగరానికి దగ్గరగా ఉండే పాలేరులో ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టారు. అక్కడి జనాన్ని ఆకట్టుకుంటే ఎమ్మెల్యేగా తాను గెలవడం ఖాయమని నిర్ణయించుకున్న షర్మిల.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు డబ్బు వెదజల్లుతున్నారు.

సొంత డబ్బుతో పాలేరులో ఫ్రీ స్కీములను అమలు చేయాలని షర్మిల నిర్ణయించారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను ఇచ్చి.. ఏ ఆస్పత్రిలో అయినా వారికి ఉచిత వైద్యం చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను రెడీ చేశారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య చెప్పించాలనుకుంటున్నారు. స్కూళ్లతో ఒప్పందాలు చేసుకుని ఆ ఫీజు తామే చెల్లించాలనుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఆర్థిక సాయం కోరితే అందించేందుకు ప్రత్యేక ఆఫీస్ పెడుతున్నారు. డబ్బుల్లేక ఉన్నత విద్య ఆగిపోయిన వారికి తెలంగాణ వైఎస్సార్ పార్టీ సాయం చేస్తుందని ప్రకటించారు.

ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి పనులు చేసేవారు. ఇప్పుడు కూడా కొంత మేర చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఆయన దారిలోనే నడుస్తూ.. పాలేరులో ఎవరు చనిపోయిన కుటుంబాలకు రూ.25 వేలు ఇస్తున్నారు. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందిస్తామని.. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి సొంత డబ్బుతో షర్మిల చేస్తున్న ఈ పనులను తెలంగాణ ప్రజలు అధికారమిస్తే రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని షర్మిల టీమ్ ప్రకటించింది. ప్రజలకు చేసే సాయమే తన రాజకీయానికి పెట్టుబడి అని షర్మిల విశ్వవిస్తున్నారు. మరి ఆమె కోరిక తీరుతుందో లేదో..