సుజనా మౌనం వెనుక మర్మం ఏమిటో?

ప్రస్తుతం ఏపీలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం…..ఆ తర్వాత ఆ బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో కోరడం వంటి వ్యవహారాలపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న ‘తెలుగు’ పొలిటిషియన్లంతా చర్చించుకుంటున్నారు.

ఇటువంటి నేపథ్యంలో గతంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందన ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. 3 రాజధానులు రావంటూ గతంలో బల్లగుద్ది మరీ చెప్పిన సుజనా…ఇపుడు మౌనవృతం ఎందుకు వీడడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

3 రాజధానుల వ్యవహారంపై ఇంత రచ్చ జరుగుతున్నా సుజనా చౌదరి మౌనంగా ఎందుకున్నారో తెలియని పరిస్థితి. ఈ విషయంలో సైలెంట్ గా ఉండాల్సిందిగా సుజనాకు బీజేపీ పెద్దలు చెప్పారా…లేదంటే ఈ విషయంలో ఏమీ మాట్లాడవద్దంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇచ్చిన వార్నింగ్ పనిచేసిందా…అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

3 రాజధానుల అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదని ఆయన అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా సుజనా….ఈ వ్యవహారంపై స్పందించారు. దీంతో, సుజనాపై సోము వీర్రాజుతోపాటు బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారని వదంతులు వినిపిస్తున్నాయి..రాజధాని విషయంలో సుజనా ప్రకటనలపై షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని టాక్.

చంద్రబాబు నమ్మినబంటుగా పేరున్న సుజనా…బీజేపీలో చేరిన తర్వాత కూడా టీడీపీ ప్రయోజనాలు కాపాడాలని చూస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోందట. అందుకే, ఇకపై సుజనా…కేవలం రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే మరో రెండేళ్లపాటు కొనసాగేలా బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారట. అంటే, ఇకపై సుజనా…ఎటువంటి ప్రకటనలు….సొంత అభిప్రాయాలు వెల్లడించే అవకాశం లేకుండా కట్టడి చేయాలని బీజేపీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే…సుజనాను కంట్రోల్ చేయాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారట. ఏది ఏమైనా…తాను వదిలిన బ్రహ్మాస్త్రం వ్యర్థమైందని బాబు ఆవేదన చెందుతున్నారట.