ఆ ఇద్దరు కేసీయార్ కు షాకిచ్చారా?

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీయార్ ఆశలు నీరుగారిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కేసీయార్ కలలు కలలుగానే మిగిలిపోతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే మొన్నటివరకు కేసీయార్ కు మద్దతిచ్చిన మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ తాజాగా కాంగ్రెస్ కు జై కొట్టడమే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో జాతీయ రాజకీయాల ముఖచిత్రం మారిపోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీయార్ నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలతో కలిసి జట్టుకట్టాలని చాలా ప్రయత్నించారు. బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జాతయస్ధాయిలో చాలా ప్రయత్నాలు చేశారు. తటస్తంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీజేడీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళను పదేపదే కలిశారు. బీజేపీ అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీయార్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొందరు మద్దతు పలికారు.

అయితే కేసీయార్ మరచిపోయిందేమిటంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీ కొనటం సాధ్యంకాదని. బలమైన బీజేపీని ఢీ కొట్టాలంటే జాతీయస్ధాయిలో యంత్రాంగం ఉన్న కాంగ్రెస్ అండలేకుండా సాధ్యంకాదు. మొదట్లో మమత కూడా కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని చూపించారు. అయితే తొందరగానే ఆమె వాస్తవాన్ని గ్రహించారు. కేసీయార్ మాత్రం తన వైఖరిలోనే తానున్నారు. ఈ నేపధ్యంలోనే కర్నాటక ఫలితాలు వచ్చాయి. వెంటనే మమత, అఖిలేష్ కాంగ్రెస్ తో చేతులు కలపటానికి అభ్యంతరం లేదని ప్రకటించారు.

అంటే వాళ్ళు కేసీయార్ ను వదిలేసినట్లే అనుకోవాలి. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ తో ఎవరు చేతులు కలుపుతారు ? అసలే జాతీయరాజకీయాల్లో కేసీయార్ కు క్రడిబులిటి చాలా తక్కువ. కేసీయార్ ఏరోజు ఎవరితో ఉంటారో ? ఎప్పుడేమి మాట్లాడుతారో కూడా ఎవరూ ఊహించలేరు. ఆ వైఖరి తెలంగాణాలో చెల్లుతాయేమో కానీ జాతీయ రాజకీయాలో చెల్లవు. అయినా కేసీయార్ తన ధోరణిలోనే తాను ముందుకెళుతున్నారు. అందుకనే చాలామంది దూరంగా పెట్టేశారు. మరి చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.