రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి లోకేష్ పోటీ?

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సారి కూడా మంగ‌ళ‌గిరి నుంచి ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో నారా లోకేష్ కూడా స్ప‌ష్ట‌త‌తోనే ఉన్నారు. గ‌త ఎన్నికల్లో విజ‌యం కోసంపోరాడిన ఆయ‌న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే.. మ‌రోసారి ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేసి పోయిన చోటే ద‌క్కించుకుంటాన‌ని కూడా చెబుతు న్నారు. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో నారాలోకేష్ ఒక్క మంగ‌ళ‌గిరి నుంచే కాకుండా.. ఉమ్మ‌డి అనం త‌పురం జిల్లాలోని క‌ళ్యాణ‌దుర్గం కానీ.. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచికానీ.. పోటీ చేయ‌డం ద్వారా ఆయన విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు. దీనికిసంబంధించి ఇప్ప‌టికే ప‌రిశీల‌న కూడా పూర్త‌యింద‌ని విశ్వ‌సనీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం. గ‌తంలో భూమా నాగిరెడ్డి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. 2017 ఉప ఎన్నిక‌లోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం అయితే.. నారా లోకేష్‌కు బ్ర‌హ్మాండంగా ఉంటుంద‌ని టీడీపీ నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఒక వేళ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, నేత‌ల బుజ్జ‌గింపుల నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌లేని ప‌క్షంలో క‌ళ్యాణ‌దుర్గం అత్యంత మెరుగైన నియోజ‌క‌వ‌ర్గంగా సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు.

దీనికి మరో కీలకమైన కారణం ఉంది. ఈరెండూ టీడీపీ గెలిచే నియోజకవర్గాలైనా ఆ రెండు చోట్ల స్థానిక నాయకులు కొట్టుకుని ఓట్లు చీల్చి వైసీపీకి వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దానిని కాపాడుకోవడానికి… రాయలసీమలో ఊపు తేవడానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పార్టీ ఆలోచిస్తోందట. ప్ర‌స్తుతం క‌ళ్యాణ‌దుర్గంలో వైసీపీకి తీవ్ర‌మైన ఎదురుగాలి వీస్తోంది. ఇక్క‌డ టీడీపీకి అనుకూల ప‌వ‌నాలు కూడా ఉన్నాయి. అదే విధంగా నంద్యాల కూడా అలాగే ఉంది.

కళ్యాణదుర్గంలో మారుతి చౌదరి- ఉమా నాయుడు, నంద్యాలలో అఖిల – ఏవీ సుబ్బారెడ్డి గొడవలు పడుతున్నారు. వీలైతే… చంద్రబాబు లోకేష్ చెరోచోట పోటీ చేస్తే… ఎలాగూ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంలో పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి ఆ రెండు సీట్లు ఎన్నికల అనంతరం రిజైన్ చేసి మళ్లీ గెలిచిపించుకోవడం కష్టం కాదు. ఈ విధంగా సునాయాసంగా వచ్చే రెండు సీట్లను గొడవలతో పోగొట్టుకోకుండా గెలిచే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తోందట. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డానికి అదనపు కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. ప్ర‌స్తుతం నారా లోకేష్ ఒక్క మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తార‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. రెండింటి ద్వారా పోటీ చేయడం ద్వారా వైసీపీను ఇరుకున పడేయొచ్చన్నది పార్టీ ఆలోచన.

ఇటీవలే పేదల ఇళ్లు ఇచ్చి ఓట్లు ఎక్కించి అక్కడ గెలుద్దాం అని వైసీపీ మేథోమదనం చేస్తుంటే అంతకంటే ముందే లోకేష్ దగ్గర పార్టీ దగ్గర విరుగుడు వ్యూహం ఉండటం వైసీపీ నేతలను షాక్ కు గురిచేస్తుందనడంలో సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టి తీరాలని లోకేష్ భావించడం వల్ల ఓటమి భయంతో రెండు చోట్ల పోటీ చేస్తారని వైసీపీ నుంచి విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.