సిద్ధరామయ్యేమీ సుద్దపూస కాదు

డీకే శివకుమార్‌పై ఉన్న సీబీఐ కేసులు, ఈడీ కేసులను బూచిగా చూపించి కర్ణాటక సీఎం కుర్చీ కొట్టేశారు సీనియర్ లీడర్ సిద్ధరామయ్య. ఎన్నికలలో ఎంత ఖర్చు పెట్టినా, ఇప్పుడు అధిష్ఠానం దగ్గర ఎంత మొరపెట్టినా కూడా శివకుమార్ మాట మాత్రం కాంగ్రెస్ కుటుంబ పెద్దలు వినలేదు. సిద్ధరామయ్యనే సీఎం చేశారు. అయితే… తెల్లని బట్టలు వేసుకునే సిద్ధరామయ్య ఏమైనా సుద్ధపూసా అనే ప్రశ్న డీకే వర్గం నుంచి, ఆయన్ను ఇష్టపడేవారి నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎంగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య చుట్టూ రాజుకున్న వివాదాలను వారు గుర్తుచేస్తున్నారు.

సిద్ధరామయ్య తనను తాను ఎప్పుడూ నాస్తికుడిగా చెప్పుకొనేవారు. జనతా పార్టీ నేపథ్యం కావడంతో సోషలిస్ట్ కలర్ కూడా ఇచ్చుకుండేవారు. కానీ… సీఎంగా ఉన్నప్పుడు ఆయన వాడే టొయోటా ఫార్చ్యూనర్ కారుపై ఓసారి కాకి వాలిన తరువాత సిద్ధరామయ్య నాస్తికత్వం ముసుగు తొలగిపోయింది. తాను వాడే ప్రభుత్వ కారు ఫార్చ్యూనర్‌పై కాకి వాలడంతో ఏకంగా ఆ కారునే మార్చేశారు సిద్ధరామయ్య. కాకిని అరిష్ఠంగా భావించడం వల్లే ఆయన కారు మార్చారని.. ఆయన మూఢ నమ్మకాల కారణంగా ప్రజాధన వృథా అయిందని అప్పట్లో విపక్సాలు ఆరోపించాయి.

కానీ, సిద్ధరామయ్య మాత్రం తనదైన శైలిలో ఆ విమర్శలకు సమాధానం చెప్పేవారు కానీ ఆ సమాధానాన్ని నమ్మినవారు మాత్రం తక్కువే. పాతకారు 2 లక్షలకుపైగా కిలోమీటర్లు తిరగడంతో దాన్ని మార్చినట్లు ఆయన చెప్పుకొనేవారు. కానీ.. జనం మాత్రం కాకి సెంటిమెంటుతోనే సిద్ధరామయ్య కారు మార్చారనేవారు.

ఈ ఒక్కటే కాదు సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు మరో వివాదం కూడా ఆయన ఇమేజ్‌ను డామేజ్ చేసింది. ఓసారి సిద్ధూ చేతికి చాలా ఖరీదైన వాచీ కనిపించింది. హబ్లట్ కంపెనీకి చెందిన ఆ వాచీ ఖరీదు 70 లక్షల రూపాయలుపైనే. దాంతో… విపక్ష నేతలు సిద్ధూ ఆ వాచీని ఎక్కడ కొన్నారు.. టాక్స్‌లు కట్టారా లేదా.. అనే ప్రశ్నలు సంధించారు. దాంతో సిద్ధూ దగ్గర వెంటనే సమాధానం లేకపోయింది. అయితే… ఒకట్రెండు రోజుల తరువాత ఆయన తెలివైన సమాధానం ఒకటి తీసుకొచ్చి పదేపదే అదే చెప్పడం ప్రారంభించారు.

అరబ్ దేశాల నుంచి వచ్చిన తన ఫ్రెండ్ ఒకరి దగ్గర ఈ వాచీ చూసి బాగుందని చెప్పడంతో అ ఫ్రెండ్ తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారు. అంతే… విమర్శకులు తమ నోళ్లను మూసుకోవాల్సి వచ్చింది. సెకండ్ హ్యాండ్ వాచీ లెక్కల్లో చూపించడంతో ట్యాక్స్ వివాదాలన్నీ పక్కకుపోయాయి. కానీ, ఆ ఫ్రెండ్ ఎవరనేది అప్పట్లో టాపిక్ అయింది. ఇలా సిద్ధూ తాను సీఎంగా ఉన్న కాలంలో పార్టీకి చాలా తలనొప్పులే తెచ్చారు. అయితే, ఇప్పుడు పార్టీ అవన్నీ మరిచి సిద్ధూనే సీఎం సీట్లో కూర్చోబెడుతోంది. మరి.. 75 ఏళ్ల సిద్ధూ ఈ వయసులో పార్టీ పెద్దలకు ఏం చెప్పారో కానీ డీకే శివకుమార్ ఎంత అరిచి గీపెట్టినా సిద్ధూనే సీఎం చేసింది అధిష్ఠానం.