చంద్ర‌బాబు చేయాల్సిందేంటి… చేస్తోందేంటి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేయాల్సింది.. చేస్తున్న‌ది.. ఇప్పుడు ఇదే విష‌యం పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం 70+ వ‌య‌సులో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనూ ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న విష‌యం. అదే స‌మ‌యంలో ఆయ‌న మ‌రింత యాక్టివ్‌గా ఉండాల‌ని కూడా కోరుకుంటున్నారు. అయితే.. ఈ వ‌య‌సులోనూ చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు.. పాద‌యాత్ర‌లు చేస్తున్నారు.

తాజాగా చంద్ర‌బాబు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పాద‌యాత్ర చేసి.. రైతులకు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. అయితే.. అస‌లు ఇప్పుడు ఈ వ‌య‌సులో పాద‌యాత్ర చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు? అనేది చ‌ర్చ‌. చంద్ర‌బాబు చేయాల్సింది.. పాద‌యాత్ర కాద‌ని.. నాయ‌కుల‌ను రంగంలోకి దింపి.. నాయ‌కుల చేత, నాయ‌కుల వ‌ల‌న‌.. నాయ‌కుల కొర‌కు .. అన్న‌ట్టుగా పార్టీని ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మేదావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ విష‌యంలో వైసీపీ అదినేత జ‌గ‌న్‌ను వారు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. తాను తిర‌గాల్సిన స‌మ‌యం లో జ‌గ‌న్ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. పాద‌యాత్ర చేశారు. దాదాపు 8 నెల‌ల పాటు ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ఆ స‌మ‌యంలో రోజా స‌హా.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఇత‌ర నేత‌లు కూడా.. తాము కూడా పాద‌యాత్ర చేస్తామ‌ని చెప్పారు. అయితే, అవ‌స‌రం లేద‌ని.. తాను చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. పాద‌యాత్ర‌కు వారిని దూరంగా ఉంచి.. పార్టీని అధికారంలోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అయితే..ఇ ప్పుడు జ‌గ‌న్ తాడేప‌ల్లి గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న ఒక్క అడుగు కూడా బ‌య‌ట‌కు పెట్ట‌డం లేదు. అదేస‌మ‌యంలో ఆయ‌న చేయాల్సింది అంతా అక్క‌డ నుంచి చేస్తున్నారు. ఇక‌, పార్టీ నాయ‌కులను గ‌తంలో పాద‌యాత్ర లు వ‌ద్దు అని చెప్పిన‌జ‌గ‌న్‌.. ఇప్పుడు మాత్రం ప్ర‌జ‌ల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కు, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌.. వంటి కార్యక్ర‌మాల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నారు.

సో.. ఇలా చేయడం వ‌ల్ల‌.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. ఇదే వ్యూహాన్ని చంద్ర‌బాబు అందిపుచ్చుకుంటే మేలు జ‌రుగుతుంది క‌దా! అనేది మేధావుల మాట‌. కేవ‌లం తాను మాత్రం ఇంకా తిరుగ‌తూ కూర్చుంటే.. కావాల్సిన కార్యం చంద్ర‌బాబు చేస్తారులే.. అని నాయ‌కులు నిమిత్త మాత్రులుగా మారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.