ఏపీలో ఆసుపత్రులు లేవా? హైదరాబాద్ కే రావాలా?

ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా వైద్యం అద్భుతంగా సాగుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా ఆ మధ్యన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటాన్ని మర్చిపోలేం. అలాంటి ఆయనే.. తనకు కరోనాపాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి.. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిపోయారు.

సామాన్య ప్రజలకు.. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఏపీలో ఆసుపత్రులు లేవా? వైద్యులు లేరా?అంటూ నీతులు బోధించే ఏపీ అధికారపక్ష నేతలు.. తమకు మాత్రం కరోనా పాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే.. ఆగకుండా వచ్చేసి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి అయితే.. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో పాటు.. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరటం ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున హైదరాబాద్ లోన కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి వచ్చేయటం చూసినప్పుడు ఏపీలో వైద్య సౌకర్యాలు అంత బాగా లేవా? అన్న సందేహం రాక మానదు.

ఏపీలో అద్భుతమైన పాలన సాగుతున్నప్పుడు.. సరైన ఆసుపత్రి కూడా లేకపోవటమా? అన్నది ప్రశ్నగా మారింది.జగన్ అద్భుత పాలనతో.. కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. ఏపీలో జాయిన్ కాకుండా హైదరాబాద్ కు వచ్చేయటంలో మర్మం ఏమిటన్నది ఇప్పుడు అర్థం కానిదిగా మారింది.

ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు వరుస పెట్టి హైదరాబాద్ కు వైద్యానికి రావటం.. ఏపీ ప్రజల్లో అయోమయాన్ని పెంచుతున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే..తమకు సర్కారు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకోకుండా హైదరాబాద్ వైపు పరుగులు పెట్టటం లో అసలు కారణం ఏమిటన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది.

ఏమైనా.. కరోనాకు చెక్ పెట్టేందుకు ఎంత భారీగా ఖర్చు చేయటం బాగానే ఉన్నామని చెప్పే ప్రభుత్వం.. తమ పార్టీకి చెందిన నేతలకు కరోనా తేలి.. తీవ్రత పెద్దగా లేకున్నా వెంటనే వారిని హైదరాబాద్ కు పంపించే ధోరణిని పలువురు తప్పు పడుతున్నారు. సామాన్యులు.. ఒక మోస్తరు వారంతా ఏపీ ఆసుపత్రులకు పరిమితమవుతున్నారు. ఇందుకు భిన్నంగా ఏపీ అధికార పక్ష నేతలు మాత్రం హైదరాబాద్ కు పరుగులు తీసి.. వైద్యం చేయించుకోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.