సీఎం జ‌గ‌న్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ముఖ్య‌మంత్రా?!

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట‌. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో కూడా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు పార్టీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 2019లో అయితే.. క్లీన్ స్వీప్ చేసేసింది. మ‌రి అలాంటి జిల్లాలో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక కూడా నాయ‌కుల‌కు ఉండ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప టికీ.. నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ భ‌జ‌న‌లోనే సేద‌దీరుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అది కూడా.. సొంత పార్టీ నాయ‌కుల నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి లేదంటూ.కొన్ని రోజుల కింద‌ట‌.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బాహాటంగా విమ‌ర్శించ‌డం.. త‌ర్వాత కాలంలో వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆత్మ ప్ర‌బోధానుసారం ఓటేయ‌డం తెలిసిందే. దీంతో పార్టీ నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న ప్ర‌జాగ‌ళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇక‌, కోటంరెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌లు కూడా ఇటీవ‌ల ఆయ‌న‌కు బ్యాన‌ర్లు క‌ట్టారు.

దీంతో కోటంరెడ్డి హ‌వా పెరుగుతోంద‌ని భావిస్తున్నారో.. ఏమో.. తెలియ‌దు కానీ, వైసీపీ అదిష్టానం మ‌ళ్లీ.. ఇక్క‌డ కాక‌రేపేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీలోని త‌ట‌స్థ నాయ‌కులు చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. అనిల్ కుమార్‌.. కోటంరెడ్డిపై నిప్పులు చెరిగారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

“ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే పక్కపార్టీలకి పోతారు. స్కూళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ది వారికి కనిపించదు. జగన్ పుణ్యమాని అన్ని విధాల లక్షణంగా ఉన్నామని మరిచిపోతే ఎలా? జగన్ ఏమీ చేయలేదు… ఏమీ చేయలేదు… అనడం సరికాదు. నాకూ చాలా చేయాలని ఉంటాయి. మన ఒక్క నియోజకవర్గమే కాదు కదా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మాదిరిగా రోడ్లుపై రోడ్లు వేసి‌ నిధులు దుబారా చేయలేదు.” అని వ్యాఖ్యానించారు.

దీనిపై కోటం రెడ్డి వ‌ర్గం కారాలు మిరియాలు నూరుతోంది. 175 నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు క‌దా! 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌జ‌లు ఓటేశారు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం అంటే.. కొన్నినియోజ‌క‌వ‌ర్గాల‌కేనా ? అని నిల‌దీస్తున్నారు. దీంతో నెల్లూరులో మ‌రోసారి రాజ‌కీయ మంట‌లు ర‌గులుకున్నాయ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.