సోనియ‌మ్మ బిడ్డ‌గా చెబుతున్నా..

Priyanka Gandhi
Priyanka Gandhi

సోనియ‌మ్మ బిడ్డ‌గా చెబుతున్నా.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా యువ‌త‌కు కాంగ్రెస్ ఇచ్చిన‌, ఇచ్చే ప్ర‌తి హామీని అమ‌లు చేసే బాధ్య‌త నాదే. ఏమాత్రం తేడా వ‌చ్చినా .. పార్టీని ప‌క్క‌న పెట్టేయండి అని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా సభకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు.

అనంత‌రం ఆమె స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరలేదని ఆరోపించారు. శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని భావించామని.. కానీ అది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదని ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని.. మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని యువతను ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న ఆమె.. రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత యువతపై ఉంది అని ప్రియాంక ఫైర్ అయ్యారు. తెలంగాణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందన్నారు.

ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. యువతను జాగృతం చేయడానికే ఇక్కడికి వచ్చానన్న ప్రియాంక గాంధీ.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చకపోతే పక్కన పెట్టేయండన్నారు. సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాంఅని స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ విడుదల చేశారు.