పొంగులేటికి డిమాండ్ పెరిగిపోతోందా ?

ponguleti srinivas reddy
ponguleti srinivas reddy

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఆమధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు భేటీ అయితే తాజాగా బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ పెద్ద బృందాన్నే తీసుకెళ్ళారు. పొంగులేటితో పాటు మహబూబ్ నగర్ సీనియర్ నేత, మాజమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా భేటీలో ఉన్నారు. ఒకేసారి పొంగులేటి, జూపల్లిని కేసీయార్ బీఆర్ఎస్ నుండి బహిష్కరించారు. దాంతో తమ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరు తమ మద్దతుదారులతో మంతనాలాడుతున్నారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు వీళ్ళని చేర్చుకోవటానికి బాగా ఇంట్రస్టు చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పొంగులేటిని చేర్చుకోవటంలో ఎందుకింత ఇంట్రస్టు చూపుతున్నట్లు ? ఎందుకంటే మాజీఎంపీకి ఉన్న ఆర్ధిక, అంగబలం కారణంగానే అని చెప్పాలి. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న పొంగులేటి ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్నారు. అలాగే జిల్లాలోని పది నియోజకవర్గాల్లోను గట్టి మద్దతుదారులు, అనుచరగణం ఉన్నది.

కాంగ్రెస్ లో అభ్యర్ధుల కొరత లేకపోయినా పొంగులేటి చేరితే ఆర్ధిక సమస్యలు ఉండవు. ఈ పాయింట్ కాంగ్రెస్ కు చాలా సానుకూల అంశం కాబట్టే పొంగులేటిని చేర్చుకోవటానికి రేవంత్ ఇంత ఆసక్తి చూపుతున్నది. ఇదే సమయంలో బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో అసలు అభ్యర్ధులే లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఎన్నికల్లో నిధుల సమస్య ఉండకపోవచ్చు. కానీ గట్టి అభ్యర్ధుల కొరత చాలా ఉంది. పొంగులేటి గనుక బీజేపీలో చేరితే అభ్యర్ధుల కొరత తీరటంతో పాటు ఆర్ధిక సమస్య కూడా ఉండదు.

ఈ విషయం ఈటలకు బాగా తెలియటం వల్లే పెద్ద బృందాన్ని వెంటేసుకుని పొంగులేటి ఇంట్లో గంటలపాటు భేటీ జరిపింది. భేటీ తర్వాత పొంగులేటి బీజేపీలో చేరిపోయినట్లే అని కమలనాదులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పొంగులేటి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. అందుబాటులోని సమాచారం ప్రకారం పొంగులేటి మనసంతా సొంతంగా పార్టీ పెట్టడంపైనే ఉంది. అయితే అందుకు సమయం సరిపోదు కాబట్టి ప్రస్తుతానికి కాంగ్రెస్ లో చేరితే ఎలాగుంటుందని మద్దతుదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి.