షర్మిలకు చాలా కష్టంగా ఉందట

తెలంగాణాలో ఎంట్రీ ద్వారా ఏదో అద్భుతాలు చేసేద్దామని అనుకుని వైఎస్ షర్మిల చాలా ప్లాన్లు వేసుకున్నారు. అయితే కాలం గడిచేకొద్దీ ఆమె ప్లాన్లు ఏవీ వర్కవుటవుతున్నట్లు లేదు. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టి ఏడాది దాటిపోయినా ఇంతవరకు గట్టి లీడర్ అని చెప్పుకునేందుకు రెండో వ్యక్తేలేరు. నిజానికి షర్మిల కూడా గట్టి నేతేమీ కారు. కాకపోతే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చెప్పుకుని జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి ఎంతోకొంత ఆదరణ కనిపిస్తోంది.

ఇప్పుడు సమస్య ఏమిటంటే ఏడునెలల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేరు. ఎందుకంటే పార్టీ నిర్మాణమే జరగలేదు కాబట్టి. ఎంతసేపు తాను వైఎస్సార్ బిడ్డనని, పులిని అని పదేపదే చెప్పుకోవటమే కానీ పార్టీ పటిష్టత మీద దృష్టిపెట్టలేదు. పార్టీలోకి కొత్తనేతలు వస్తేనే పార్టీ పటిష్టమవుతుంది. రాజకీయాలను దగ్గర నుండి చూస్తున్న షర్మిలకు ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరమేలేదు.

ఇపుడు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీచేసి గెలవాలన్నది షర్మిల ఆలోచన. ఒకపుడు షర్మిల గెలుస్తుందేమో అని జనాల్లో చర్చ జరిగింది. కానీ ఇపుడు గెలుపు కష్టం అనే చర్చ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే పార్టీనేతలు ఒక్కొక్కళ్ళుగా రాజీనామాలు చేసేస్తుండటమే. జిల్లా అధ్యక్షుడు లక్కినేని సురేందర్ పార్టీకి రాజీనామా చేశారు.

లక్కినేనితో పాటు ఆయన వర్గమంతా రాజీనామా చేసి పార్టీకి దూరమైపోయారు. సురేందర్ రాజీనామాతో పార్టీని జిల్లాలో నడిపించేవాళ్ళే లేకుండా పోయారు. కొత్త నేతలు పార్టీలో చేరే సంగతిని పక్కనపెట్టేస్తే ఉన్న నేతలను నిలుపుకోవటం కూడా కష్టంగా ఉంది. ఈ పరిస్ధితుల్లో రేపటి ఎన్నికల్లో పాలేరులో షర్మిల ఎలా గెలుస్తారనే చర్చ పెరిగిపోతోంది. పాలేరులో షర్మిల పోటీ తప్ప మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలు+ఖమ్మం ఎంపీలో ఎవరు పోటీచేస్తారో ఎవరికీ తెలీదు. పోటీచేస్తారనేస్ధాయిలో అసలు ఎవరి పేర్లు కూడా ప్రచారంలో లేవు. ఇలాంటి పార్టీని నడపటం షర్మిలకు చాలా కష్టంగా ఉందనే ప్రచారం పెరిగిపోతోంది.