వివేకా కేసు విచార‌ణ వాయిదా

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు విచార‌ణ‌.. సుదీర్ఘ వాయిదా ప‌డింది. ఈ కేసును విచారిస్తున్న నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచార‌ణ‌ను ఏకంగా..జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. వాస్త‌వానికి ఈ కేసును ఏప్రిల్ 30(ఈ నెల‌)న పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు గ‌తంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేస్తారంటూ.. వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే.. సుప్రీంకోర్టు స్వ‌యంగా జోక్యం చేసుకుని విచార‌ణ‌ను జూలై 31 వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని.. సీబీఐకి గ‌డువు పొడిగించింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న వివేకా స్నేహితుడు, ఆయ‌న‌కు కుడిభుజం వంటి వ్య‌క్తి.. ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఆయ‌న సీబీఐ కోర్టులో లొంగిపోవాల‌ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో తాజాగా ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం వీరు జైల్లో ఉన్నారు.

వీరిని విచారించిన కోర్టు.. అనంత‌రం జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్‌ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. తాజాగా మ‌రో ఆదేశం కూడా వెలువ‌డింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు.. అంటే జూలై 31వ తేదీ వ‌ర‌కు గంగిరెడ్డి బెయిల్‌ రద్దు అమలులో ఉంటుందని తెలిపింది.

ఆ త‌ర్వాత కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్‌ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వొచ్చని ట్రయల్‌ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. అయితే.. ఆయ‌న‌ను పోలీసులు కోర్టు ఆదేశాల మేర‌కు.. చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. విచార‌ణ‌ను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.