100వ ఎపిసోడ్‌కు 100 కోట్ల ఖ‌ర్చు.. మోడీ పెద్ద మ‌న‌సు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పెద్ద మ‌న‌సు.. అన్ని సంద‌ర్భాల్లోనూ వ్య‌క్తం కాదు. త‌న‌కు అవ‌స‌రం.. బీజేపీకి మేలు చేస్తుంద‌ని ఆయ‌న అనుకున్నారంటే.. ఎక్క‌డా లేని విధంగా నిధుల వ‌ర‌ద గంగా ప్ర‌వాహం మాదిరిగా ప్ర‌వ హిస్తుంది. ఇప్పుడు కూడా ప్ర‌ధాని 100 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు అంగీకారం తెలిపారు. అధికారులు ఇలా చెప్పారో లేదో.. మోడీ అలా ఓకే చెప్పారు. మ‌రి విష‌యం ఏంటంటే.. మ‌రో రెండు రోజుల్లో ప్ర‌ధాని ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం మ‌న్ కీ బాత్‌ 100 వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

2014లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మ‌న్ కీ బాత్ అనే కార్యక్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌జ‌ల‌తో త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకునే కార్య‌క్ర‌మం ఇది. దీనిని ప‌ర్య‌వేక్షించేందుకు సెక్ర‌ట‌రీ స్థాయి అధికారుల‌తో పెద్ద బృంద‌మే ఉంది. వీరు రాష్ట్రాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్ర‌జ‌ల ఉంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ..వారి నుంచి ఉత్త‌రాలు తీసుకుంటూ.. ఈ మ‌న్‌కీ బాత్‌ను తీర్చి దిద్దుతున్నారు.

ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం రేడియో మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న మ‌న‌సు లోని భావాల‌ను పంచుకుంటారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాల సంస్కృతులు.. క‌ళ‌లు.. ఇత‌రత్రా విష‌యాలు.. అవార్డులు.. రోగాలు, వ్యాక్సిన్‌లు ఇలా.. అదీ ఇదీ.. అనే తేడా లేకుండా అన్నీ మాట్లాడుతున్నారు. ఇక‌, ఇప్పుడు 2024 ఎన్నిక‌లకు ముంగిట‌.. ఈ నెల 30న ప్ర‌సారం కానున్న మ‌న్ కీ బాత్ 100 వ ఎపిసోడ్‌.

దీనిని ప్ర‌పంచ‌స్థాయిలో 80 దేశాల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అగ్ర‌రాజ్యం అమెరికాలోని వైట్ హౌస్ కూడా ఉంది. అక్క‌డ కూడా.. ప్ర‌త్యేక అనుమ‌తులు తీసుకుని ప్ర‌సారం చేయ‌నున్నారు. అదేవిధంగా ఐక్య‌రాజ్య‌స‌మితి.. జీ20 స‌ద‌స్సుల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇక, న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాలు.. నియోజ‌క‌వ‌ర్గాలు(మొత్తం 547 పార్ల‌మెంటుస్థానాల్లో), గ్రామాల్లోనూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి.. ప్ర‌సారం చేస్తారు. దీనికి గాను మొత్తం 100 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసేందుకు మోడీ సంత‌కం చేశారు. ఇదీ.. సంగ‌తి!!