క‌ర్ణాట‌క‌లో తాజా స‌ర్వే.. బీజేపీ ప‌రిస్థితి దారుణం!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు వారాలే స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. కీల‌క నేత‌లు రంగంలోకి దిగారు. స్టార్ క్యాంపెనర్లుగా ఉన్న సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిలావుంటే.. మ‌రో 15 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌లో ఎవ‌రు అధికారం ద‌క్కించుకోనున్నార‌నే విష‌యంపై తాజాగా ఒక స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైన రెండు రోజుల్లోనే.. క‌ర్ణాట‌క ప‌రిస్థితిపై అనేక సంస్థ‌లు ఫ‌లితాలు వెల్ల‌డించాయి. ఆయా ఫ‌లితాల్లో కాంగ్రెస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నార‌ని స్ప‌ష్టం చేశాయి. అలాగే.. పోటీ మాత్రం తాడోపేడో.. అన్న‌విధంగా సాగుతుంద‌ని కూడా చెప్పాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ.. 100 స్థానాల్లో విజ‌యంద‌క్కించుకుంటుంద‌నే అవ‌కాశం ఉంద‌ని కూడా పేర్కొన్నాయి.

అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. బీజేపీ హ‌వా స‌న్న‌గిల్లుతున్న‌ట్టు మ‌రో తాజాగా సర్వే పేర్కొంది. Tv9 కన్నడ, సీ ఓటర్స్ సంస్థ‌లు… సంయుక్తంగా చేసిన సర్వేలో బీజేపీ దారుణ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఏకంగా.. 106-116 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని ఈ స‌ర్వే తేల్చి చెప్పింది.

ఇక‌, బీజేపీ కేవ‌లం 79 – 89 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని.. అది కూడా స్వ‌ల్ప మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ప్రాంతీయ పార్టీ కుమార‌స్వామి నేతృత్వంలోని జేడీఎస్ 24 – 34 స్థానాలు మాత్ర‌మే ద‌క్కించుకుంటుంద‌ని పేర్కొంది. ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ఐదుగురు వ‌ర‌కు గెలుస్తార‌ని చెప్ప‌డం విశేషం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.