ఎన్నికల పొత్తుపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .. !

2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు..

రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు.
ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా..? అనే అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానమే ఇచ్చారు.

నిజానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం ద్వారా మనం మనం ఒకటేనని చంద్రబాబు సందేశమిచ్చారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో..తాను అదే ధోరణిలో ఆలోచిస్తున్నానని చెప్పారు. ప్రధాని విజనుతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు.

దేశానిభివృద్ధి కోసం.. తెలుగువాళ్లం కోసం తన  పరిధిలో పనిచేస్తున్నానని  చంద్రబాబు వెల్లడించారు. భారతదేశ బలమేంటో.. ప్రధాని  మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నందుకు  సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పట్లో పోరాడిన మాట నిజమేనని అంగీకరించారు. ఏదేమైనా అపోహలు తొలిగిపోయి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నందుకు ఇరు పార్టీల కార్యకర్తలు సంతోష పడుతున్నారు.