తెలంగాణాలో కూడా కర్నాటక మోడలేనా ?

తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో కూడా కర్నాటక మోడల్ నే అమలు చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయినట్లున్నారు. మేడ్చల్ బహిరంగసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్ను రద్దుచేస్తామని ప్రకటించారు. ముస్లింలకు ఇపుడు తెలంగాణాలో అమల్లో ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తారట.

అలా రద్దుచేసిన రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని అమిత్ ప్రకటించారు. తెలంగాణాలో ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. సేమ్ టు సేమ్ ఇలాంటి విధానాన్నే బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటకలో ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్ను బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దు చేసింది. అలా రద్దుచేసిన రిజర్వేషన్ శాతాన్ని ఒక్కలిగలకు 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే.

కర్నాటకలో ముస్లింల జనాభా గణనీయంగానే ఉంది. అయినా వాళ్ళ రిజర్వేషన్లను సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకు రద్దుచేశారో అర్ధంకావటంలేదు. అలాగే 224 సీట్ల అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ముస్లింలకు కేటాయించలేదు. కర్నాటక బీజేపీలో ముస్లిం నేతలున్నా కూడా ఎక్కడా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ రెండు నిర్ణయాలు మే 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయని అందరు అనుకుంటున్నారు.

అసలే కర్నాటకలో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. దానికి అదనంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఒక్క ముస్లిం నేతకు కూడా టికెట్ ఇవ్వకపోవటంతో మరింత సమస్యగా మారిందని సమాచారం. ఇవన్నీ ఉండగానే చాలామంది సీనియర్లకు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్ శెట్టర్ లాంటి వాళ్ళకు కూడా టికెట్లు దక్కలేదు. దాంతో కొందరు రెబల్ అభ్యర్ధులుగాను మరికొందరు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరి పోటీచేస్తున్నారు. మొత్తంమీద ఎన్నికల్లో బీజేపీ ఎంత కంపుచేసుకోవాలో అంతా చేసుకుంది. మరి దీనివెనుక మోడీ, అమిత్ షా కు ఏదన్నా వ్యూహం దాగుందేమో తెలీదు. రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.