జగన్ మదిలో సుప్రీం గుబులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్యమనస్కంగా ఉంటున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కొంత ఊరట లభించినట్లే అనుకున్నా సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో జగన్ కు టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే ఇచ్చినప్పటి నుంచి జగన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. తాము ఒకటి తలిస్తే కోర్టు మరోక తీర్పు ఇస్తోందని జగన్ భావిస్తున్నారట.

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షా సమావేశాల్లో సీఎం ముభావంగా ఉంటున్నట్లు అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సమీక్షా సమావేశాల్లో తానేమీ మాట్లాడకుండా అధికారులు చెప్పినది విని ఊరుకుంటున్నారట. మీటింగ్ ఎప్పుడు అయిపోతుందా అన్న ఫీలింగ్ ఆయనలో కనిపిస్తోందని చెబుతున్నారు. సమావేశాలు జరిగినంత సేపు ఆయన ముళ్ల మీద కూర్చున్నట్లుగా మొహం పెడుతున్నారని పార్టీ వర్గాలు కూడా విశ్లేషించుకుంటున్నారు..

జగన్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కోడి కత్తి కేసు బూమరాంగ్ అయ్యింది. ఇప్పుడు అవినాశ్ రెడ్డిని ఎలా గట్టెక్కించాలన్న ఆలోచనే జగన్ ను వెంటాడుతోంది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టినా, స్వామీజీలను ప్రయోగించినా పని కావడం లేదన్న భావన ఆయనలో కనిపిస్తోంది. అందుకే కోర్టులను, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

వివేకా కేసు తిరిగి తిరిగి తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన జగన్ మనసులో ఏర్పడిందని సన్నిహితులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ తీరుతో జగన్ లో కొత్త భయాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు.. లాంటి అంశాలను సీబీఐ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండడంతో జగన్ అండ్ కో భయాలు పెరుగుతున్నాయి. గూగుల్ టేకౌట్ ను సీబీఐ తెరపైకి తీసుకురావడంతో అధికార పార్టీ నేతల్లో బీపీ పెరిగింది. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు, పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మొబైల్ ఫోన్లు వాడకుండా నేరుగా మనుషులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు… ప్యాలెస్ కు వచ్చే కొంతమందిని ఫోన్ తీసుకురావద్దని కూడా ముందుగానే సంకేతాలు పంపుతున్నారు. ఇంటి దగ్గరే ఫోన్లు వదిలేసి రావాలని చెబుతున్నారు. ఫోన్లను కారులో వదిలేసి వచ్చినా ఇబ్బందేనన్న ఫీలింగు వారిలో కలుగుతోంది.

జగన్ మీద మాత్రమే కాకుండా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై సీబీఐ నిఘా ఉందని తెలియడంతో తాడే పల్లి ప్యాలెస్ తో ఎవరూ ఫోన్లో మాట్లాడకూడదని ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు వివేకా హత్య కేసులో సాధ్యమైనంత తక్కువ కామెంట్స్ చేయాలని, తప్పనిసరి అనిపిస్తేనే స్పందించాలని సూచించిట్లుగా తెలుస్తోంది. గూగుల్ టేకౌట్ అంటేనే జగన్ వర్గం వణికిపోతోందని చెబుతున్నారు.